CM Chandrababu Naidu Meeting with Party Leaders : అధికారంలోకి వచ్చామన్న అలసత్వాన్ని వీడి.. ఇకపై ప్రజలకోసం పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులు, కీలక నేతలకు సూచించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ లో ఆయన ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రులు తరచూ పార్టీ కార్యాలయానికి వచ్చి వెళ్తుండాలని సూచించారు. దీనిని సేవగా భావించాలని తెలిపారు. రోజుకు ఇద్దరు మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.
మంత్రులను పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యతను.. జోనల్ ఇన్ఛార్జులకు అప్పగించారు చంద్రబాబు నాయుడు. కార్యకర్తల వినతులను స్వీకరించి వాటిని పరిష్కరించడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. వినతుల స్వీకరణకు ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read : మంచి చేసే వారికి స్పీడ్ బ్రేకర్లు ఉండవ్.. సీఎం చంద్రబాబు
అలాగే.. పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ.. వ్యక్తిగత దాడులు, కక్షసాధింపు చర్యలకు దిగొద్దని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వైసీపీ చేసిన తప్పులే మనం కూడా చేస్తే.. వాళ్లకు, మనకు ఎలాంటి బేధం ఉండదన్నారు. తప్పు చేసిన నేతలను చట్టపరంగానే శిక్షిద్దామని హితవు పలికారు. అనంతరం.. గత ప్రభుత్వ పాలనలో టీడీపీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల గురించి సీఎం ఆరా తీశారు. వారందరికీ చట్టపరంగా ఎలా విముక్తి కలిగించాలన్నదానిపై నేతలతో చర్చించారు.
ఇన్ఛార్జులు తమ పరిధిలో నమోదైన కేసుల వివరాలను పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పార్టీకోసం కష్టపడుతూ.. పార్టీకి అండగా ఉన్న వారందరికీ నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్యపరమైన అంశాలపై తమ బాధల్ని చెప్పుకునేందుకు తరలివచ్చిన ప్రజలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా కలిసి.. వినతిపత్రాలను స్వీకరించారు.