CM Chandrababu About Polavaram Project : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తొలుత పోలవరం ప్రాజెక్టు వద్ద ఏరియల్ వ్యూ నిర్వహించారు. స్పిల్ వే తో పాటు.. పోలవరం చుట్టుపక్కల ప్రాంతాలను వీక్షించారు. అనంతరం అధికారులతో మాట్లాడి.. స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై ఆరా తీశారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, జలవనరులశాఖ అధికారులతో కలిసి బస్సులో ప్రాజెక్ట్ పరిసరాలను పరిశీలించారు.
కాగా.. ఇదివరకు కుంగిన ఎడమగట్టు గైడ్ బండ్ ను పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2014-19 లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చిన చంద్రబాబు.. తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి.. పనుల పురోగతిపై ఆరా తీసేవారు. ఇప్పుడు మళ్లీ అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు.
అధికారులతో సమీక్ష అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలవరం పనులను టీడీపీ 72 శాతం పూర్తి చేసి ఇస్తే.. ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేయకూడని తప్పులు చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం పనులను కొనసాగించి ఉంటే.. పోలవరం ప్రాజెక్టు 2020లోనే పూర్తయి ఉండేదన్నారు. తాను ఇప్పటివరకూ పోలవరాన్ని 31 సార్లు సందర్శించానని, తన కష్టాన్నంతా బూడిదలో పోసిన పన్నీరుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. పట్టుబట్టి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించాం కాబట్టే.. పోలవరాన్ని కట్టగలిగామని చెప్పారు. గత ప్రభుత్వం వస్తూ వస్తూనే ఏజెన్సీని మార్చిందని, దాంతో జవాబుదారితనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరంభం నుంచి ఇప్పటి వరకూ పోలవరం అనేక అవాంతరాలను ఎదుర్కొందని, డయాఫ్రమ్ వాల్ 35 శాతం డ్యామేజ్ అయిందని తెలిపారు. రూ.550 కోట్ల వ్యయంతో నిర్మించిన కాఫర్ డ్యామ్ ల మధ్య గ్యాప్ ను పూడ్చలేకపోయారని విమర్శించారు. పోలవరం పూర్తయితే.. రాయలసీమకు కూడా నీరందించగలుగుతామని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్యకాలంలో పోలవరం కోసం యావరేజిగా రూ.13,600 కోట్లను ఖర్చు చేశామని.. ఆ కష్టమంతా వృథా అయ్యేలా గత ప్రభుత్వం అలసత్వం వహించిందన్నారు. ఒక వ్యక్తి రాష్ట్రానికే శాపమయ్యాడని, పోలవరాన్ని మరింత సంక్లిష్టంగా మార్చారని దుయ్యబట్టారు. ఏదేమైనా పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.