CM Chandrababu Fires on Pharma Industries(Andhra news today) : విశాఖజిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అంతకుముందు మృతుల కుటుంబాలను, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం.. మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ప్రమాదంలో మొత్తం 17 మంది మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. వారందరికీ ఈరోజే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నామని వెల్లడించారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన కంపెనీ ఎసెన్షియా రెడ్ కేటగిరీలో ఉందని తెలిపారు. కంపెనీలు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని పేర్కొన్నారు. పరిశ్రమలో పేపర్ క్రౌడ్ పేలుడు జరిగిందని వివరించారు. ఎస్ఓపీ సరిగ్గా పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.
Also Read: పంచాయతీల్లో మలిదశ విప్లవం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో 119 అగ్నిప్రమాదాలు జరిగాయని, ఐదేళ్లకాలంలో రాష్ట్రంలో 120 మంది చనిపోయారని తెలిపారు. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం సంబంధిత కంపెనీలపై ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదన్నారు. రెడ్ కేటగిరీలో ఉన్న కంపెనీలు ఇప్పటికైనా కార్మికులకు సంబంధించిన తగు జాగ్రత్త చర్యలను పాటించాలని తెలిపారు. అందరు ఇండస్ట్రియలిస్టులందరూ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సంఘటనను ఆధారంగా తీసుకుని.. ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదంపై హైలెవల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలో ఉండే అవకతవకల గురించి, నాణ్యతా ప్రమాణాలను అన్నింటినీ అధ్యయనం చేస్తారన్నారు. ప్రమాదానికి కారకులైన వారెవరైనా సరే వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. పరిశ్రమ యాజమాన్యంలో ఉన్న అంతర్గత సమస్యలు కూడా ప్రమాదానికి ఒక కారణమని భావిస్తున్నట్లు తెలిపారు.