CM Chandrababu fires on TDP MLAs: కూటమి అధికారంలోకి వచ్చేందుకు రేయింబవళ్లు కష్టపడిన తమ్ముళ్లే.. ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారుతున్నారా? ఎక్కడికక్కడ వివాదాలు.. విమర్శలు మూటగట్టుకొని అధినేతకు తలనొప్పి తెప్పిస్తున్నారా? అందుకే ఎవరైనా సరే తప్పు చేస్తే చర్యలు తప్పవని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ముదురుతున్న వివాదాలకు ఆ హెచ్చరిక చెక్ పెడుతుందా.. అసలు చంద్రబాబు వార్నింగ్ ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు తెలుగు తమ్ముళ్లు నిత్యం ఏదో ఒక వివాదంతో తెరమీదికి వస్తున్నారు. కొన్ని ఘటనలు మెయిన్ మీడియాలో వస్తుండగా.. మరిన్ని ఘటనలపై పార్టీకి రోజూ ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇవన్నీ సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. దీంతో కేబినెట్ సమావేశం నిర్వహించి దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఏకంగా ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు సీఎం. కష్టపడి సాధించుకున్న మంచిపేరు వారి కారణంగా దెబ్బతింటుందని చివాట్లు పెట్టారు. మీరు మారతారని ఆశిస్తున్నా. మారకపోతే.. ఏం చేయాలో నాకు బాగా తెలుసని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో మంత్రులకు కూడా బాధ్యతలు అప్పగించారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలను గైడ్ చేయాల్సిన బాధ్యత మంత్రులుకు అప్పగించారు చంద్రబాబు. ఇకపై ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా మంత్రులే సమాధానం చెప్పాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఎక్కడ ఎలాంటి గలాటా జరిగినా.. దానిలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నా.. అక్కడికక్కడే హెచ్చరించాలని పవర్స్ ఇచ్చారు. ఆ విషయాలను తన దృష్టికి కూడా తీసుకురావాలని సీఎం సూచించారు. వైసీపీ మాదిరిగా టీడీపీ ఉండబోదని దిశానిర్దేశం చేశారు. వైసీపీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటే.. అందుకు కారణం అలాంటి ఘటనలేనని.. ఆ తరహా ఘటనలు టీడీపీలో జరిగితే ఉపేక్షించేది లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: ఖాళీ అవుతున్న వైసీపీ.. మరో ఇద్దరు పార్టీకి, పదవులకు రిజైన్!
ఈ పరిస్థితి మారకపోతే.. తానే మారే పరిస్థితి వస్తుందని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే మొదటి, ఫైనల్ వార్నింగ్ అని తేల్చి చెప్పారు. అయితే.. చంద్రబాబు హెచ్చరికలను ఎంత మంది తమ్ముళ్లు పాటిస్తారో అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడికక్కడ ఆధిపత్య ధోరణి, పైచేయి కోసం ప్రయత్నిస్తున్న కొంత మంది తెలుగు తమ్ముళ్లు.. ఇప్పటికైనా మారకపోతే.. చంద్రబాబు వారిపై కొరడా ఝళిపించడం ఖాయంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ప్రజలకి మంచి పాలన అందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి వంద రోజులకు ఒకసారి ఎమ్మెల్యేలను మంత్రులది ప్రోగ్రెస్ రిపోర్టు అందజేస్తానని వెల్లడించారు.
అలానే పార్టీలో చేరికలపై కూడా సీఎం చంద్రబాబు స్పందించారు. టీడీపీలోకి ఎవరినిపడితే వారిని చేర్చుకోబోమని అన్నారు. చేరాలనుకునేవారు తమ పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసి రావాలని స్పష్టం చేశారు. వారి ట్రాక్ రికార్డును బట్టి.. మంచివారినే చేర్చుకుంటామని చెప్పారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులకు టీడీపీలోకి వచ్చే అవకాశం ఇవ్వబోమని చెప్పారాయన.
ఓవరాల్గా చూస్తే చంద్రబాబు .. అటు ప్రభుత్వం..ఇటు పార్టీ.. అంటూ రెండు పడవలను బ్యాలెన్స్ చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అందిస్తూనే.. కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మరోవైపు పార్టీపై పట్టు సడలకుండా లైన్ దాటుతున్న నేతలను వార్నింగులతో గాడిన పెడుతున్నారు.