CM Chandrababu Naidu At Harekrishna Gokul Kshetra: రాష్ట్రంలో మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, ఇక మంచి చేద్దామనుకునే వారికి స్పీడ్ బ్రేకర్స్ ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపనలో చంద్రబాబు పూజలు చేశారు.
అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్న క్యాంటీన్లను తిరిగి పున:ప్రారంభిస్తామని వెల్లడించారు. హరేకృష్ణ సంస్థ దైవసేవతోపాటు మానవ సేవను సమానంగా చేస్తుందన్నారు. వేంకటేశ్వరస్వామి దయతోనే బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డానని, ప్రపంచానికి సేవలు అందించే అవకాశం కోసమే తిరిగి ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అధికారి జస్టిస్ రమణ పాల్గొన్నారు.
మంచి చేసే వారంతా ముందుకు రావాలని, అందరికీ ఏపీ చిరునామాగా ఉంటుందన్నారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 50మందికి పైగా ఐఐటీ గ్రాడ్యూయేట్స్ సేవలో పాల్గొనడం అభినందనీయమని కొనియాడారు.
పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని, అక్షయ పాత్ర ద్వారా నిత్యం 22 లక్షలమందికి భోజనం పెడుతున్నామన్నారు. అన్న క్యాంటీన్లకు చిన్న ఫిర్యాదు లేకుండా అక్షయ పాత్ర నిర్వహించిందని తెలపారు.
Also Read: చెల్లెమ్మ ఆపరేషన్..అన్నయ్య పరేషాన్ : ఏపీలో రసవత్తర రాజకీయం
ఇదిలా ఉండగా.. హరేకృష్ణ సంస్థకు అన్నదానికి దాతలు రూ.3కోట్లు విరాళం ప్రకటించారు. పారిశ్రామిక వేత్త పెనుమత్స శ్రీనివాస్ రాజు రూ. కోటి విరాళం అందజేశారు. అలాగే పూర్ టు రిచ్ స్ఫూర్తితో వంద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థకు సక్కు గ్రూపు రూ.కోటి విరాళం, యలమంచిలి కృష్ణమోహన్ గ్రూపు రూ.కోటి విరాళం అందించాయి. ఈ మేరకు దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు.