CM Chandrababu: తిరుమల లడ్డూ వ్యవహారం రోజురోజుకూ తీవ్రమవుతోంది. అన్నివర్గాల నుంచి విమర్శలు తీవ్రమవుతున్నాయి. న్యాయస్థానంలో పిటిషన్లు సైతం దాఖలు అవుతున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని చంద్రబాబు సర్కార్ సీరియస్గా తీసుకుంది.
ఇదిలావుండగా సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా సమావేశమయ్యారు. అరగంటకు పైగా జరిగిన సమావేశంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎవరిని సిట్ చీఫ్గా నియమించాలనే దానిపై చర్చ జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: మాకు సంబంధం లేదు.. మమ్మల్ని వదిలేయండన్న జగన్ దంపతులు
సిట్ చీఫ్గా సీనియర్ ఐజీ స్థాయి అధికారిని నియమించనున్నారు. ఆయన టీమ్లో ఇద్దరు డీఐజీలు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీ స్థాయి అధికారులున్నట్లు తెలుస్తోంది. టీమ్ ఎంపిక దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రంలోగా సిట్ బృందాన్ని ప్రభుత్వం ప్రకటించనుంది.
టీటీడీపై విచారణకు కేవలం 30 రోజులు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన వ్యవహారాలపై ఇప్పటికే విజిలెన్స్ దర్యాప్తు చేస్తోంది. చాలావరకు డీటేల్స్ వచ్చే ఉంటాయని, మిగతా కోణాల్లో సిట్ దర్యాప్తు చేస్తే ఈ ఇష్యూకు ముగింపు పలకవచ్చని అంటున్నారు. రేపటి రోజున న్యాయస్థానం నుంచి నోటీసులు వచ్చినా విచారణ జరుగుతోందని చెప్పడానికి వీలవుతుందనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
సిట్లో ఎవరెవరు పోలీసు అధికారులు ఉంటారనే దానిపై ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వాలని వైసీపీ భావిస్తోంది. దీనిపై ముందుగా నేతలు నోరు ఎత్తవద్దని అధిష్టానం నుంచి కొంతమంది నేతలకు ఆదేశాలు వెళ్లినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.