YSRCP latest news(Andhra Pradesh political news today): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీలో ముసలం మొదలైంది. ఆ పార్టీలో అధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. మంత్రి వేణుపై బోస్ వర్గం తిరుగుబాటుకు దిగడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.
ఆదివారం వెంకటాయపాలెంలో పిల్లి బోస్ వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. బోస్పై అభిమానంతోనే వేణును గత ఎన్నికల్లో గెలిపించామని ఎంపీ వర్గీయులు స్పష్టం చేశారు. ఇప్పుడు మంత్రి తమపైనే రౌడీషీట్ తెరిపిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొడుకు రాజ్యాంగేతర శక్తిగా మారారని ఆరోపించారు. వైసీపీని మంత్రి వేణు నాశనం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
శెట్టిబలిజలను మంత్రి వేణుగోపాలకృష్ణ అణగదొక్కుతున్నారని బోస్ వర్గం నేతలు ఆరోపించారు. ఈసారి రామచంద్రపురం టికెట్ వేణుకి ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పిల్లి బోస్ కుటుంబానికే రామచంద్రపురం టికెట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీ టికెట్ బోస్ కుటుంబానికి ఇవ్వకపోతే.. ఆయన కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్ ను పోటీకి దించి గెలిపిస్తామని తేల్చిచెప్పారు.
రూ.12 కోట్లు ఖర్చు పెట్టామని, డబ్బులిస్తేనే పనులు చేస్తానని మంత్రి చెబుతున్నారని పిల్లి బోస్ వర్గీయులు ఆరోపించారు. ఈ నెల 26న అమలాపురంలో సీఎం వైఎస్ జగన్ ను కలిసి పరిస్థితులు వివరిస్తామని బోస్ అనుచరులు అన్నారు. వచ్చే ఎన్నికల్లో పిల్లి సూర్యప్రకాశ్కు వైసీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.