YCP vs TDP in narasaraopet today(AP politics) : పల్నాడు జిల్లా నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం దాడులకు పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటనలో టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి చదలవాడ అరవిందబాబు, ఆయన కారు డ్రైవర్, పలువురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు టీడీపీ నాయకులను చెదరగొట్టి, వైసీపీ నేతలను ప్రోత్సహించారనే ఆరోపణలు వచ్చాయి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ఇటీవల ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
టీడీపీ నేత చల్లా సుబ్బారావు నివాసం వద్ద ఓ ఇంటిపై వివాదం నడుస్తోంది. ఆ ఇంటి యజమాని టీడీపీ, వైసీపీ వర్గీయుల వద్ద అప్పు తీసుకున్నాడని తెలుస్తోంది. ఆ ఇల్లు విషయంలో ఇరువర్గాలు మధ్య పంచాయితీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ వర్గీయులు ఆదివారం రాత్రి సుబ్బారావు ఇంటివద్దకు వెళ్లారు. ఆ ఇల్లు విషయంతోపాటు ఎమ్మెల్యే గోపిరెడ్డిపై చేసిన అవినీతి ఆరోపణలపైనా వాగ్వాదం జరిగింది. అదే సమయంలో కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని , సుబ్బారావు ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసమైందని టీడీపీ నేతలు ఆరోపించారు.
టీడీపీ ఇన్ ఛార్జ్ చదలవాడ అరవిందబాబుకు దాడి విషయాన్ని చల్లా సుబ్బారావు ఫోన్ లో తెలియజేశారు. దీంతో ఆయన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అరవిందబాబు కారు దిగుతున్న సమయంలోనే ఆయనపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది.
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడకు రావడంతో వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారని టీడీపీ నేతలు తెలిపారు. అదే సమయంలో టీడీపీ నేత కడియాల రమేష్ అక్కడకు వెళ్లారు. ఆయన వాహనంపైనా రాళ్ల దాడి జరిగింది. ఒకవైపు టీడీపీ కార్యకర్తలపై దాడి జరుగుతున్నా.. పోలీసులు ఎమ్మెల్యే గోపిరెడ్డికి రక్షణగా నిలబడ్డారే తప్ప .. దాడులను నియంత్రించేందుకు ప్రయత్నించలేదని విమర్శలు వచ్చాయి. నరసరావుపేటలో తాజా పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు.