Narayana: అమరావతి రాజధాని భూముల కుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఏపీ సీఐడీ ఉచ్చు బిగిస్తోంది. హైదరాబద్లోని నివాసంలో ఆయనను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నారాయణ సతీమణి, ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ యజమానిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. కూకట్పల్లి లోధా అపార్ట్మెంట్లో, మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
నారాయణ సంస్థల నుంచి రామకృష్ట హౌసింగ్ సంస్థలోకి నిధుల మళ్లించినట్లు సీఐడీ అధికారులు గతంలోనే గుర్తించారు. బినామీల పేర్లపై అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు చేసినట్లు తేల్చారు. నారాయణ అప్పటి మంత్రులు, వారి బినామీలు ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి అసైన్డ్ భూముల కొనుగులు చేసినట్లు నిర్ధారించారు. ల్యాండ్ పూలింగ్ కింద ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఈ భూముల కొనుగోలు జరిగాయని, టీడీపీ ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి మందడం, వెలగపూడి రాయపూడి, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు నిర్ధారించారు.
తమవారికి లాభం చేకూరేలా అలైన్మెంట్ డిజైన్లు నారాయణ మార్చారని ఆరోపణలున్నాయి. భూముల కొనుగోలు కోసం నారాయణ ఎడ్యుకేషన్ సొపైటీ, నారాయణ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్, రామనారాయణ ట్రస్టు ద్వారా 17.5 కోట్ల నిధులు మళ్లించారని నిర్ధారించారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు భారీగా నిధుల మళ్లించి, ఆ నిధులను అసైన్డ్ భూమి రైతులకు చెల్లించారని తేల్చారు.
150 ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోలుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. రాజధాని పరిసరాల్లో ఆవుల మునిశంకర్ పేరుపై 4.2 కోట్ల విలువగల భూమి నారాయణ కొనుగోలు చేశారని దర్యాప్తులో తేలింది. 2017 జూన్, జూలై, ఆగస్టులో భూములు న కొనుగోలు చేశారని నిర్ధారించారు. పొట్టూరి ప్రమీల పేరుపైనా, రావూరి సాంబశివరావు పేరుపైనా భూములు కొనుగోలు చేశారని తేల్చారు. ఈ భూముల కొనుగోలు సమయంలో ముగ్గురి అకౌంట్లలోకి భారీగా నిధులు మళ్లించినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. గతంలో నారాయణ కుమార్తెలు శరాని, సింధూర ఇళ్లలోనూ సీఐడీ సోదాలు నిర్వహించింది. బ్యాంకు లావాదేవీలు, ఫోన్ కాల్స్ రికార్డ్స్ స్వాధీనం చేసుకుంది.