Chitoor Politics : రాయలసీమలోని పదిహేను నియోజకవర్గాల పరిధిలో ప్రాభల్యం చూపించే బలిజ సామాజిక వర్గం విషయంలో వైకాపా నిర్లక్ష్యం వహిస్తుందా…? ఇప్పుడు ఇదే అంశం ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఆ సామాజిక వర్గానికి ఉన్న ఓకే ఒక్క ఎంఎల్ఏను ఎందుకు తప్పించిందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్గా నియమించిన విజయానందరెడ్డిపై ఎందుకు అంతా ప్రేమా అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అసలు, సీనియర్లు వద్దన్నప్పటికి విజయానందరెడ్డికి ఎందుకు అవకాశం కల్పించారు?
చిత్తూరు సిటీ ఎమ్మెల్యే సీటు విషయంలో బలిజ సామాజిక వర్గాన్ని కాదని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విజయానందరెడ్డి వైపు వైసీపీ అధిష్టానం మొగ్గు చూపించింది. ఇప్పుడు దీనిపై రాయలసీ వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేనను కాదని బలిజ సామాజిక వర్గం గుంపగుత్తగా వైసీపీకు మద్దతు ఇచ్చింది. ఆ సామాజికవర్గం ఉన్న చోట్ల భారీ మెజార్టీని వైసీపీ సాధించింది. రాయలసీమ వ్యాప్తంగా కేవలం చిత్తూరు నగరంలోనే బలిజలకు అవకాశం ఇవ్వగా ఆరణి శ్రీనివాసులు విజయం సాధించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్ను దన్నుగా విజయానందరెడ్డి ఉన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఆయన మీదున్న ఎర్రచందనం అక్రమ రవణా కేసులు తిరగదొడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కిరణ్ కూమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా విజయానందరెడ్డికి చుక్కలు చూపించారు. కేసులు ఈడి వరకూ వెళ్ళాయి. ఈ పరిస్థితుల్లోనూ విజయానందరెడ్డి వైకాపాతోనే ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపాకు ఆర్థికసాయం అందించారు. దీంతో పాటు, జీడీ నెల్లూరు బాధ్యతలు మొత్తం ఆయనే తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎపిఎస్ఆర్టీసి వైఎస్ చైర్మన్గా అవకాశం కల్పించారు సీఎం జగన్. కాగా, జగన్మోహన్ రెడ్డితో పాటు సిఎంఓతో కూడా ఆయనకు సత్సంబధాలు పెరిగాయి. మరో వైపు, ఆయనకు ప్రత్యేకంగా విజయవాడలో క్యాబిన్ కూడా ఏర్పాటు చేసారు. దీనితో స్థానికంగా విజయానందరెడ్డి హావా పదింతలు పెరిగినట్లు ఆయన వర్గం చెప్పుకుంటున్నారు.
గతంలో చిత్తూరు కాంగ్రెస్లో సీకే బాబు తిరుగులేని నాయకుడు. అప్పుడు కూడా రెడ్డి సామాజికవర్గానిదే పెత్తనం. టిడిపి మాత్రమే సామాజిక వర్గ సమీకరణాలు చూసుకొనేది. అయితే, తర్వాత మారిన పరిణామాలు… జనసేన ఆవిర్బావం జరిగినప్పటి నుండీ బలిజల అంశం తెరపైకి వచ్చింది. అప్పటికీ బలిజలు టిడిపితోనే ఉన్నారు. కాని గత ఎన్నికల్లో వారు కూడా వైసీపీ అభ్యర్థి బలిజ కావడంతో అటు వైపు మరలారు. దీనికి తోడు ఇలాంటి పరిణామాలతో విజయానందరెడ్డి వ్యూహం మార్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తెలివిగా తన వర్గాన్ని తయారు చేసుకున్నారు. ముందుగా వ్యాపారులను తన గ్రిప్లోకి తెచ్చుకున్నారు. మార్కెట్ రుసుము తానే కట్టి వ్యాపారులను తనవైపు తిప్పుకున్నాడు.
దీంతో పాటు బలిజ సామాజికవర్గంలో గ్రూపులు తెచ్చి, ఓగ్రూపును ఎంఎల్ఏ వర్గం నుంచి తన వైపు తిప్పుకున్నాడు. మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన బుల్లెట్ సురేష్ గ్రూపును సైతం తనవైపు తిప్పుకున్నాడు. మరో వైపు, వరదల సమయంలో పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు పంపిణీ చేసారు. ఇక, కరోనా సమయంలో కూడా ఇదే విధంగా ప్రజా సేవ చేసాడు. దీంతో పాటు, జగన్ నుంచి మిథున్ రెడ్డి వరకూ ఎవ్వరి బర్తేడే అయినా పెద్ద ఎత్తున నిత్య సంత్పరణ చేసాడు. ఐదు సంవత్సరాలుగా నిత్యం ప్రజలలో ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. ఇదే ఇప్పుడు ఆయనకు సక్సెస్ ఇస్తుందని ధీమాగా ఉన్నాడు.
మరో వైపు ఎమ్మెల్యే శ్రీనివాసులు తన వ్యవహార ధోరణితో రోజు రోజుకు ప్రభావం తగ్గించుకున్నాడు. ముఖ్యంగా, నగర పాలక సంస్థ వేతనాల నుంచి తన ఇంట్లో పనిచేసేవారికి వేతనాలు ఇవ్వడం వరకూ అసంతృప్తులు పెరిగారు. దీనికి తోడు, మాజీ కార్పోరేటర్ స్థల కబ్జా వ్యవహారం, మరో వైపు నగర పాలక సంస్థలోని కాంట్రాక్టు వర్క్లన్ని తానే చేయడంతో మిగతా కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వకపోవడం లాంటి ఘటనలతో ఆయన ఇమేజ్ క్షీణించడం మొదలయ్యింది. ఇదే సమయంలో భారీగా నగర పాలక సంస్థ కార్పోరేటర్లు వ్యతిరేకించడం కూడా జరిగింది. అయితే పెద్దిరెడ్డి ఆశీస్సులు, ఉమారెడ్డి బంధువు కావడంతో తనకు ఇబ్బంది లేదనుకున్నారు. కాని ఐప్యాక్ సర్వేలలో మొత్తం జీరో రావడంతో రాయలసీమలో మెజార్టీ సీట్లు రావాలని భావించిన జగన్ శ్రీనివాసులను పక్కకు పెట్టాల్సి వచ్చిందని అంతా అనుకుంటున్నారు. కాగా, ఇదే ఇప్పుడు విజయానందరెడ్డిని తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, బలిజ సామాజిక వర్గాన్ని సంతృప్తి పర్చడానికి శ్రీనివాసులకు రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరగుతుంది. టీడీపీ రెండు సార్లు అదే సామాజక వర్గానికి చెందిన రామచంద్రయ్యకు రాజ్యసభకు అవకాశం కల్పించింది. కాని ఫిలితం లేదు. ఇలాంటి సమయంలో అవకాశం ఇవ్వడమే వృథా అని వైకాపాలోని మరో వర్గం అంటుందంట. మొత్తం మీద, ఒక వర్గం నుంచి పోయే ఓట్ల కోసం ఎందుకు ఓ సీటు ఓడిపోవాలనే నిర్ణయంతో ఆరణినీ తప్పించారని పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. అయితే, ఇదే సమయంలో ప్రతిపక్షాలకు మరో ఆయుధం దొరికింది. ఎర్రచందనం అక్రమ కేసులలో ఉన్న వ్యక్తికి ఎలా అవకాశం ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. విజయానందరెడ్డిని తెరపైకి తీసుకురావడం ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్లే అని సీనియర్లు చెప్పినప్పటికి విజయానందరెడ్డికే జగన్మోహన్ రెడ్డి ఓటు వేసాడని అంటున్నారు. మొత్తం మీద, దీనిని ప్రతిపక్షాలు ఎలా క్యాష్ చేసుకుంటారో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
.
.