Chiranjeevi: టాలీవుడ్ మేటి నటుడు చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశపు రెండవ అత్యున్నత పౌరపురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించటంతో తెలుగువారిలో ఆనందం వెల్లివిరిసింది. సినీ, రాజకీయ ప్రముఖులంతా చిరంజీవిని కలిసి ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి, అక్కడి సీఎం జగన్ మాత్రం చిరంజీవికి దక్కిన గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ చిన్న ప్రకటన కూడా చేయలేదు.
దీంతో చిరంజీవి అభిమానులంతా ఏపీ సీఎం జగన్ మీద సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. సినీ పరిశ్రమ కోసం తమ అభిమాన నటుడు చూపిన చొరవ, ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేసుకుని ఏపీ ప్రభుత్వం మీద మండిపడుతున్నారు.
ఇండస్ట్రీ సమస్యల కోసం చిరంజీవి ఎదుర్కొన్న అవమానాలు ఇప్పుడు కొన్ని వైరల్ అవుతున్నాయి.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే, చిరంజీవి నాయకత్వంలో తెలుగు సినీ ప్రముఖులంతా కలిసి, సినీ పరిశ్రమ కష్టాలు చెప్పుకుందామని తాడేపల్లి ప్యాలస్కు వెళ్లినప్పుడు.. సీఎం జగన్ ప్రదర్శించని ధోరణిని చిరంజీవి అభిమానులు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.
కోట్లాది ప్రేక్షకుల మనసు గెలిచిన తమ అభిమాన నటుడిని, అతడితో బాటు తరలి వెళ్లిన ఇతర నటులు, ప్రముఖ దర్శక నిర్మాతలను తానుండే భవనానికి కిలోమీటరు దూరంలోనే కారు దిగేలా చేసి, అక్కడి నుంచి నడిపించాడని వారు మండి పడుతున్నారు.
సీఎం హోదాలో వచ్చిన వారిని ఆహ్వానించటంగానీ, సాదరంగా మాట్లాడటం గానీ జగన్ చేయలేదని, ఆయన ధోరణితో ఇబ్బంది పడినప్పటికీ.. చిరంజీవి మాత్రం సినీ పరిశ్రమ కోసం చేతులు జోడించి తమ సమస్యలను పట్టించుకోవాలని ప్రాధేయపడ్డారని వారు గుర్తుచేసుకుంటున్నారు.
ఒకవైపు బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో మన తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుతోంటే.. ఆ గొప్ప నటులను అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రం వారి గురించి ఒక్కమాట మాట్లాడే ప్రయత్నం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇలాంటి పురస్కరం వస్తే.. దేశంలోని ఏ ముఖ్యమంత్రి అయినా.. స్వయంగా వచ్చి కలిసి సన్మానించటమే గాక అధికారికంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించేవారనీ, దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, అనేక కష్టనష్టాలకు ఓర్చి, 40 ఏళ్ల పాటు నటించి, 155 సినిమాలను అందించి, సినిమా రంగంలో అగ్రస్థానానికి చేరి, తెలుగువారి పేరును దిగంతాలకు వ్యాపింపజేసిన తమ అభిమాన నటుడిని కావాలనే పట్టించుకోవటం లేదని చిరంజీవి అభిమానులు ఆరోపిస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపించి అధికారమదాన్ని ప్రదర్శిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతామని అభిమానులు హెచ్చరిస్తున్నారు.