Chikki Bar Covers Changed in Andhra Pradesh: బడిపిల్లల కోసం గత ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరుతో.. నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించే పథకాన్ని ప్రారంభించింది. మధ్యాహ్న భోజన మెనూను సవరించి.. దానికే జగనన్న గోరుముద్ద అని పేరు పెట్టారు. 2020 జనవరి 21 న ప్రారంభమైన జగనన్న గోరుముద్దలో.. పిల్లలకు రోజుకొక మెనూ భోజనాన్ని అందించింది.
సోమవారం – అన్నం, గుడ్డు కూర, వేరుశెనగ చిక్కి
మంగళవారం – పులిహోర, టమాట పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం – కూరగాయల అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి
గురువారం – ఖిచిడీ, టమాట చట్నీ, ఉడికించిన గుడ్డు
శుక్రవారం – బియ్యం, తోటకూర, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కి
శనివారం – అన్నం, సాంబారు తీపి పాయసం
వీటిలో వారానికి మూడుసార్లు అందించే వేరుశెనగ చిక్కీ కవర్ కి జగన్ ముఖం, వైసీపీ జెండా రంగులు అద్దేశారు. పిల్లలకు అందించే ప్రతీ పథకం పై జగన్ ముఖాన్ని ముద్రించడం అప్పట్లో వివాదాస్పదమైంది కూడా. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో అదే వేరుశెనగ చిక్కీ కవర్ మారింది. జగన్ సర్కార్ కవర్లను తీసేసి.. రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో కూడిన కవర్లతో కొత్త ప్యాకింగ్ చేశారు.
Also Read: ఏపీ మంత్రి వర్గం ఖరారు.. 17మంది కొత్తవారే.. పవన్ కల్యాణ్కు ఆ శాఖ ?
రేపటి నుంచి ఏపీలో పాఠశాలలు ప్రారంభం కానుండగా.. పిల్లలకు కొత్తగా ప్యాకింగ్ చేసిన పల్లీ చిక్కీలను అందించనున్నారు. వీటితో పాటు విద్యార్థులు కోడిగుడ్లు, రాగిపిండిని సరఫరా చేయనున్నారు. అయితే.. వాటిపై ఉన్న ప్యాకింగ్ కూడా మారుస్తారా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఇదే కదా మేం కోరుకున్నది.. రాష్ట్రంలో మార్పు మొదలైందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ నేతలు.. మచ్చుకైనా ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల ముందు వరకూ మీడియా ముందు విరుచుకుపడిన నేతలంతా ఇప్పుడు ఎక్కడా నోరు మెదపడం లేదు. కొడాలి నాని, పేర్నినాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, సజ్జల, అనిల్ కుమార్ యాదవ్.. వీరంతా మిన్నకుండిపోయారు. ఓటమికి కారణాలేంటో జగన్ అడిగినపుడు అందరూ.. ప్రజల నాడి తెలియలేదని, ఏ సమస్య మీ వరకూ రానివ్వకుండా సజ్జల, ధనుంజయరెడ్డి అడ్డుకున్నారని చెప్పినట్లు ప్యాలెస్ వర్గాల నుంచి టాక్ వినిపించింది.