Chicken Shops Closed for Three Months in Nellore(Local news Andhra Pradesh): ఏపీలోని నెల్లూరు జిల్లాలో మూడునెలల పాటు చికెన్ షాపులను మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. అందుకు కారణం బర్డ్ ఫ్లూ వ్యాప్తి. జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలలో పేర్కొన్నారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో .. అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన జిల్లాలో బర్డ్ ఫ్లూ పై చర్చించారు.
పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామాలలో ఇటీవలే ఏవీఏఎన్ ఇన్ఫ్లూయెంజాతో పెద్దఎత్తున కోళ్లు మరణించాయని తెలిపారు. మరణించిన కోళ్ల నుంచి సేకరించిన శాంపిళ్లను అధికారులు భోపాల్ లోని పరీక్ష కేంద్రానికి పంపగా.. అక్కడ ఇన్ఫ్లూయెంజా నిర్థారణ అయిందని, కాబట్టి చికెన్ తినడం ద్వారా ప్రజలకు ఇది సోకే ప్రమాదం ఉండటంతో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read More : తెనాలిలో వివాహిత హత్య.. గొంతు కోసి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు
నిబంధనల ప్రకారం.. కోళ్లు మరణించిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో మూడు రోజులపాటు చికెన్ షాపులను మూసివేయాలని, కిలోమీటరు పరిధిలో 3 నెలల వరకూ చికెన్ షాపులు తెరవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఆయా ప్రాంతాల నుంచి 15 రోజుల వరకూ కోళ్లు బయట ప్రాంతాలకు డెలివరీ చేయకుండా, ఇతర ప్రాంతాల నుంచి అక్కడకికి కోళ్లను సరఫరా చేయకుండా చూడాలన్నారు. వ్యాధి కారణంగా మరణించిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని తెలిపారు. అలాగే కోళ్ల ఫారంలలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రజలు, కోళ్ల పెంపకం దారులు, చికెన్ షాపుల నిర్వహకుల్లో బర్డ్ ఫ్లూ పై అవగాహన తీసుకురావాలని తెలిపారు. ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ చేయించాలని సూచించారు. బర్డ్ ఫ్లూ పై చాట్లగుట్ట, గుమ్మళ్ల దిబ్బ గ్రామాల్లో డీపీఓ, జిల్లా పరిషత్ సీఈఓ గ్రామసభలు నిర్వహించి.. బర్డ్ ఫ్లూ పై అవగాహన కల్పించాలని సూచించారు.