Tirumala : అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తోంది. దర్శనం కోసం వెళ్తున్న భక్తులపై తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు చిన్నారులపై చిరుతలు దాడి చేశాయి. ఓ బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. మరో బాలికి చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత భక్తులు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చిరుతలను బంధించే ఆపరేషన్ టీటీడీ అధికారులు చేపట్టారు. అలిపిరి మార్గంలో చిరుతలను పట్టుకునేందుకు ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశారు.
దైవ దర్శనం కోసం వెళ్తున్న భక్తులు నడకమార్గంలో భయాందోళన చెందుతున్నారు. అయితే అలిపిరి మార్గంలో 8 చిరుతలు సంచరిస్తున్నాయని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను టీటీడీ ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఖండించారు. అందులో ఎంతమాత్రం నిజం లేదన్నారు. 8 చిరుతలు సంచారమనేది కేవలం రూమర్ మాత్రమేనని కొట్టిపారేశారు. ఇప్పటివరకు 4 చిరుతలను మాత్రమే గుర్తించామని చెప్పారు.
నడకదారి భక్తులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఫారెస్ట్ అధికారి తెలిపారు. చిరుతలను గుర్తించడానికి ప్రత్యేకంగా 220 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు. దీని వల్ల చిరుతల సంచారాన్ని సులభంగా గుర్తించవచ్చని అన్నారు. చిరుతల బెడదపై దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారం కోసం టీటీడీ చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకే ఏపీ అటవీశాఖ అనుమతులతో చిరుతలను బంధించేందుకు ప్రత్యేక బోనుల ఏర్పాటు చేశామని తెలిపారు.