Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరంలో పర్యటించారు. టీడీపీ నేత దొంతు చిన్నా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దొంతు చిన్నా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. అనంతరం ధ్వంసమైన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించారు.
పక్కా ప్లాన్ తో గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ సైకోలే ఈ దాడి చేశారని మండిపడ్డారు. కొంతమంది పోలీసు అధికారుల తీరును తప్పుపట్టారు. వాళ్ల వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. గన్నవరం పాకిస్థాన్ లో ఉందా అని ప్రశ్నించారు. తనను పర్యటించొద్దని ఎలా చెబుతారని నిలదీశారు.
బెదిరింపులకు భయపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అరాచకాలపై పోరాడుతూనే ఉంటామన్నారు. రెచ్చగొట్టి తప్పుడు పనులు చేస్తే తమ ప్రభుత్వం వచ్చాక జైలుకు పోవాల్సిందేనని హెచ్చరించారు. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఎందరో అధికారులు గతంలో జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు పోలీసులు కూడా అదే మార్గంలో వెళ్లవద్దని సూచించారు. ఎన్నివేల మంది వస్తారో రావాలి సవాల్ చేశారు. తాడోపేడో తెల్చుకుందామని చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు.
ఉగ్రవాదుల కంటే ఘోరంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా ఉద్యమానికి ప్రజలే ముందుకురావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.