Chandrababu : ఏపీలో వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల్లో ఓపిక నశించిందన్నారు. అందుకే తిరుగుబాటు మొదలైందని స్పష్టం చేశారు. రాయలసీమలో నీరు పారించాలని తాము చూస్తున్నామని కానీ వైసీపీ నాయకులు రక్తం పారించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తూ వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావొద్దని పోలీసులకు సూచించారు.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా రేణిగుంటలో టీడీపీ నిర్వహించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 4,300 చెరువులున్నాయని తెలిపారు. ఆ చెరువుల ద్వారా 47 వేల ఎకరాల సాగు భూమికి నీరు అందించవచ్చని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం చెరువుల అభివృద్ధిని పట్టుంచుకోవడంలేదని విమర్శించారు. 1,147 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులను ఆక్రమించారని ఆరోపించారు. 75 ఎకరాలను పూడ్చి మరీ కబ్జా చేశారని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరులో 25 ప్రాజెక్టులు ప్రీక్లోజర్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
వైసీపీ పాలనలో సీఎం తర్వాత ఎక్కువ దోపిడీకి పాల్పడింది పెద్దిరెడ్డే అని చంద్రబాబు స్పష్టంచేశారు. వేణుగోపాలసాగర్, శ్రీబాలాజీ రిజర్వాయర్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక పోవడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రశ్నిస్తే రక్తం కళ్ల చూడాలనుకుంటారా? అని చంద్రబాబు నిలదీశారు.
మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. శుక్రవారం పుంగనూరులో విధ్వంసం జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ శ్రేణులే దాడులకు దిగాయని అధికార పక్షం అంటోంది.