Chandrababu : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. ఏపీ బడ్జెట్లో 2.35 శాత నిధులను జలవనరులకు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ఆ నిధులతో ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమా? అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమాన్ని చంద్రబాబు మూడో రోజు చేపట్టారు. అనంతపురం జిల్లాలో ఆయన పర్యటించారు. ఆ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
హంద్రీనీవా, సుజల స్రవంతి ఫేస్- 2లో భాగమైన మారాల రిజర్వాయర్ను తన హయాంలో పూర్తి చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. కాలువలు పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో రూ.4,182 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. కానీ వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.515 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు.
గొల్లపల్లి రిజర్వాయర్ ఆయకట్టును యుద్ధ ప్రతిపాదికన నిర్మించటం వల్లే కియా పరిశ్రమ ఏర్పాటు అయ్యిందని చంద్రబాబు వివరించారు. గుంతకల్లు బ్రాంచి కెనాల్ లో శిథిలావస్థలో ఉన్న అండర్ టన్నెళ్ల మరమ్మతులు చేపట్టక పోవడం వల్లే లీకేజీలతో నీరు అందడంలేదని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పుట్టకనుమ రిజర్వాయర్ రద్దు, ముట్టాల ప్రతిపాదన పనులు జరగడం లేదని చంద్రబాబు ఆరోపించారు.