Chandrababu naidu news today(Latest political news in Andhra Pradesh) : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలిచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పవన్పై ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమనేలా రాష్ట్రంలో పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారాయన. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు చేస్తున్నారని.. రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అణిచివేత ధోరణి మానుకోవాలంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.
నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే కేసు పెడతారా అని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత వివరాలు.. కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు అన్నారాయన. దాన్ని దుర్వినియోగం చేయడం నీచాతినీచంగా తెలిపారు. కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్పై ముందుగా కేసు పెట్టి, విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
జగన్ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడ్డమే పెద్ద జోక్ అంటూ చంద్రబాబు సెటైర్ వేశారు. 4 ఏళ్ల పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్టలు ఎప్పుడో మంటగలిశాయని ట్వీట్ చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు, వ్యక్తిగత దాడులు ప్రభుత్వ పాపాలను దాచిపెట్టలేవని హెచ్చరించారు.