Chandrababu latest Speech(Andhra politics news): ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. ప్రజలను గోదావరిలో ముంచేశారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో నిర్వహించిన ‘రా.. కదలిరా..’ బహిరంగ సభలో జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ పాలన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని వివరించారు. ఇక జగన్ను భరించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు దోపిడీ చేసిందని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. రూ.12 లక్షల కోట్లు అప్పులు చేశారని తెలిపారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. జగన్ అర్జునుడు కాదు.. అక్రమార్జునుడు అని చంద్రబాబు విమర్శల బాణాలు సంధించారు. దేశ రాజకీయాల్లో ఇంత అక్రమంగా ఆర్జించే వారిని తాను చూడలేదన్నారు.
రాష్ట్ర ప్రజలకు డబ్బులు కాదు.. దెబ్బల మీద దెబ్బలు ఇచ్చారని జగన్ పై మండిపడ్డారు.
మద్యం దోపిడీతో జగన్ జలగ లా జనం రక్తం తాగుతున్నారని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. రూ.64 వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచారని తెలిపారు. జగన్ మళ్లీ జైలుకు వెళ్తే అప్పులు ప్రజలే కట్టాల్సి వస్తుందన్నారు. వైసీపీ పాలనలో ప్రజల సంపద ఆవిరైందని అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.
టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తయ్యాయని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు పనులు ఏడాదిలో పూర్తి చేశామని గుర్తుచేశారు. పట్టిసీమ ద్వారా 120 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. పోలవరం ద్వారా నదులు అనుసంధానిస్తామన్నారు. కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరిస్తామన్నారు. ఆక్వా, పామాయిల్ రైతులకు ప్రోత్సాహకాలు అందించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మళ్లీ వెలుగులు నింపే శక్తి మనకే ఉందన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం’’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.