Chandrababu : రాష్ట్రం సర్వనాశనమైపోతుంటే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రానికి పట్టిన ఐదేళ్ల శనిని వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సైకో చేతిలో రాష్ట్రం సర్వనాశనం అవుతోందని మండిపడ్డారు. ఒక సైకో ఊరికో సైకోని తయారు చేస్తున్నాడని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ సైకోలను భూ స్థాపితం చేసే వరకూ తాను పోరాడుతానని స్పష్టం చేశారు.
సీఎం వైఎస్ జగన్ దెబ్బకు కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. అమరరాజా బ్యాటరీస్ రూ.9,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుందని తెలిపారు. ఇలా అయితే రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. అమరరాజా పరిశ్రమను గత సీఎంలు ప్రోత్సహిస్తే.. జగన్ వేధిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఏపీ వ్యక్తి పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వెళ్లారని తెలిపారు. నారాయణ విద్యాసంస్థల అధినేతనూ వేధిస్తున్నారని రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.
పోలవరం పూర్తి చేయడానికి తాను ఎంతో కృషి చేశానన్నారు. సీఎం జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు నాశనమవుతుందని బాధగా ఉందన్నారు. ప్రజల ఉత్సాహం చూస్తే వెయ్యి ఏనుగుల బలం వస్తోందన్నారు. యువత భవిష్యత్తు కాపాడేందుకే వచ్చానని చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి నిడదవోలు వరకు చంద్రబాబు భారీ రోడ్ షో నిర్వహించారు. దారి పొడవునా టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు.