టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రాజమండ్రి జైలు నుంచి రోడ్డుమార్గంలో విజయవాడకు బయలుదేరగా.. టీడీపీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు ఆయనకు దారిపొడవునా ఘన స్వాగతం పలికారు. ఆయన రాజమండ్రి నుంచి విజయవాడకు చేరుకునేందుకు 14 గంటలకు పైగా సమయం పట్టింది. అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు షెడ్యూల్ మారింది. వాస్తవానికి ఇవాళ తిరుపతికి వెళతారని.. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్కు వెళ్లాలని భావించారు. కానీ ఆయన నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నారు. కోర్టు ఆదేశాలతో ఆయన అక్కడే వైద్య పరీక్షలు చేయించుకుంటారని.. ఎవరినీ కలవరని టీడీపీ నేతలు చెబుతున్నారు.
దాదాపు పద్నాలుగనర్న గంటల నిర్విరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45 గంటల సమయంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సుదీర్ఘ ప్రయాణంతో చంద్రబాబు అలసిపోయారు. చంద్రబాబు ఇంటికి చేరుకునే సరికే.. అక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు, అమరావతి రైతులు, మహిళలు భారీగా గుమిగూడారు.పెద్దఎత్తున నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని నినాదాలు చేశారు.