Chandrababu: సజ్జల రాజేసిన సమైక్య రాష్ట్రం మంటలు ఎగిసిపడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అగ్గి రాజుకుంది. రెండు రాష్ట్రాలను కలపాలన్న సజ్జల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకోగానీ టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం మౌనంగా ఉన్నాయి. ఉద్యమ సమయంలో టీడీపీ, బీజేపీలు రాష్ట్ర విభజనకు మద్దతు పలికాయంటూ మళ్లీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేయడంతో టీడీపీ అలర్ట్ అయింది. స్వయంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబే రంగంలోకి దిగి సజ్జల కామెంట్లను తప్పుబట్టారు.
ప్రజా సమస్యలను పక్కనపెట్టి సమైక్య రాష్ట్రం ప్రకటనలా? అంటూ నిలదీశారు చంద్రబాబు. సమైక్యాంధ్ర అంటూ ప్రజలను మభ్యపెట్టడం మోసపూరితమన్నారు. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మండిపడ్డారు. చేసిన తప్పులను ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాలని హితవు పలికారు.
ఏపీలో రైతు ఆత్యహత్యలు పెరగడం ఆందోళనకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. 3 ఏళ్లలోనే 1673 మంది రైతుల ఆత్మహత్యలతో సూసైడ్స్ స్టేట్గా మారిందన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే రైతులు అప్పుల పాలవుతున్నారని.. మద్దతు ధర, సబ్సిడీలు లేకపోవడంతోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. సర్కారు సత్వరం స్పందించి అన్నదాతలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.