Chandrababu Rajashyamala Yagam(Andhra pradesh today news): అధికారమే లక్ష్యంగా వ్యూహాలే కాదు.. హోమాలు కూడా చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సమయం దొరికినప్పుడల్లా ఆధ్మాత్మిక సేవలో గడుపుతున్నారు. గతంలో పూజలు, హోమాలపై ఆసక్తి చూపని ఆయన.. స్కిల్ కేసులో జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత.. పలు దేవాలయాలు సందర్శిస్తూ సతీమణితో కలిసి మొక్కులు తీర్చుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే శతచండీ పారాయణ ఎకోత్తర వృద్ధి చండీయాగంతో పాటు సుదర్శన నారసింహ హోమాలు నిర్వహించారు. ఇక తాజాగా నేటి నుంచి మూడు రోజులపాటు ఆయన నివాసంలో రాజశ్యామలయాగం చేయనున్నారు చంద్రబాబు.
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో టీడీపీ విజయకేతనం ఎగురవేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు యాగాల బాట పట్టారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో ఏనాడు హోమాలు, యాగాలపై అంత ఆసక్తి చూపని చంద్రబాబు.. వరుసగా ఆలయాల సందర్శనతోపాటు యాగాలు, హోమాలు నిర్వహించడంతో అధికారం కోసమే, సీఎం సీటు కోసమే టీడీపీ అధినేత ఆధ్యాత్మిక బాట పట్టారన్న ప్రచారం సాగుతోంది. ఇక ఇది వరకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి తమ పార్టీ అధికారంలోకి రావడానికి.. తాము సీఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో చంద్రబాబు కూడా ఇదే బాటలో యాగం జరిపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
Read More : చిత్తూరు జిల్లాలో పొలిటికల్ డ్రామా.. హాట్ టాపిక్ గా మారిన డీకే ఫ్యామిలీ రాజకీయం..
కొద్దిరోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసీపీ, వైసీపీని గద్దె దించాలని టిడిపి-జనసేన కూటమి ప్రయత్నిస్తున్నాయి. ఏయే నియోజకవర్గాల్లో ఎవరిని నిలబెడితే గెలుస్తామో.. సర్వేలు చేయించుకుని మరీ సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మరోవైపు టిడిపి-జనసేన కూడా అదే పనిలో ఉంది. ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న ఎన్నికల కమిషన్ బృందం.. పర్యటనలు ముగిసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. సుమారుగా ఏప్రిల్ రెండవ వారం తర్వాత ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికలు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెడతాయో చూడాలి.