Chandrababu : నెల్లూరులో టీడీపీ ఆధ్వర్యంలో ‘రా కదిలిరా’ బహిరంగను నిర్వహించారు. ఈ సభకు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. టీడీపీ జెండాలతో నెల్లూరు మొత్తం పసుపుమయమైంది. జనాన్ని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాష్ట ప్రజలకు అబధ్దాలు చెప్పి మళ్లీ అధికారంలోకి రావడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
జగన్ తనను తాను అర్జునుడు, అభిమన్యుడిగా పోల్చుకుంటున్నాడు.. అతను అభిమన్యుడు కాదు, అర్జునుడు కాదు.. భస్మాసురుడు అనే రాక్షసుడు అని బాబు ఎద్దేవా చేశారు. ప్రజలను పీడించడం తప్పా తను చేసింది ఏమీ లేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిందన్నారు. గల్లా జయదేవ్ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారన్నారని చంద్రబాబు ఆరోపించారు. రాజకీయ కుటుంబం రాజకీయాలు వద్దనే పరిస్థితి తెచ్చారన్నారు.
అబద్ధాలు చెప్పి మళ్లీ అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ చెప్పే అబద్దాలకు ఎవ్వరూ మోసపోవద్దన్నారు. వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో ఏ మాత్రం మార్పు రాలేదన్నారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. రైతులు ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందుందన్నారు. టీడీపీ-జనసేనలు అధికారంలోకి రాగానే ఆక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
దేశంలో అందరు సీఎంల కంటే జగన్ వద్దే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. నిరుద్యోగంలో 24 శాతంతో ఏపీ అగ్రస్థానంలో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేని స్థితిలో పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని హమీ ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులను సైతం కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. నిధులను తిరిగి ఇచ్చి, తగిన గౌరవం పంచాయతీలకు ఇస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి చెల్లిస్తామని పేర్కొన్నారు.