Chandrababu : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో టీడీపీ ఆవిర్భావ సభ విజయవంతంగా జరిగింది. ఈ వేడుక టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి.. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ 41 సంవత్సరాల ప్రయాణంలో సాధించిన విజయాలు చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎన్టీఆర్ పార్టీ పెట్టారని గుర్తు చేశారు. మానవత్వమే తన సిద్ధాంతమని ఆనాడు ఎన్టీఆర్ చాటి చెప్పారన్నారు. ఆయన పాలనా సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం అని స్పష్టంచేశారు. చరిత్ర ఉన్నంత వరకు ఈ పార్టీ ఉంటుందని చంద్రబాబు అన్నారు.
నా బాటలో వైఎస్ఆర్, కేసీఆర్..
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై చంద్రబాబు పొగడ్తల వర్షం కురింపించారు. తన తర్వాత వైఎస్ఆర్ కూడా రాష్ట్రాభివృద్ధిని కొనసాగించారని కొనియాడారు. కేసీఆర్ సహా.. తన తర్వాత వచ్చిన సీఎంలు హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసినందుకు అభినందనలు తెలిపారు. తాను తెలుగుజాతి కోసం తాను పనిచేశానన్నారు. హైదరాబాద్ను మానవవనరుల అభివృద్ధి కేంద్రంగా చేశానని, విభజన సమయంలో సమన్యాయం కోసం పోరాడిన పార్టీ టీడీపీ అని అన్నారు.
మళ్లీ అధికారంలోకి వస్తాం..
ఏపీ రాజధాని కోసం 33 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని,హైదరాబాద్కు ధీటుగా అమరావతి నిర్మాణం చేపట్టామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన కంటే జగన్ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. సైకో అనాలా? దద్దమ్మ అనాలా? చేతకాని వ్యక్తి అనాలా? రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టాడు అనాలో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. పులివెందులలో తుపాకీ సంస్కృతి వచ్చిందని మండిపడ్డారు. తెలుగుదేశం చారిత్రక అవసరం తెలుగువారందరికీ ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభం అయిందని.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. మళ్లీ ఏపీలో అధికారంలోకి వస్తాం.. రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తెస్తామని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
టీడీపీతోనే అభివృద్ధి..
ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత తెలుగు జాతి చరిత్ర మారిందన్నారు. పసుపు జెండా అంటే ఆత్మగౌరవమని గుర్తించాలన్నారు. ఎన్టీఆర్ వచ్చాక తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చిందన్నారు. హైదరాబాద్ విదేశాలతో పోటీ పడటానికి కారణం చంద్రబాబు అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఏపీకి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.