TDP President Chandrababu: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల వేళ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదిక(ఎక్స్) లో ఆయన తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలు అంశాల గురించి ఆ పోస్ట్ లో ప్రస్తావించారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పడి నేటికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ఈ పోస్ట్ పెట్టారు. రాష్ట్రాలు రెండుగా వీడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలంతా ఒక్కటేనంటూ ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం ముందుకు సాగాలంటూ సూచించారు. 2047 కల్లా ప్రపంచంలో భారతీయులు.. అందులోనూ తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read: ముందుగానే ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది.. ఎందుకంటే: సజ్జల రామకృష్ణ
కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఆ వేడుకల్లో చాలామంది ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. పలువురు అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు. ఉమ్మడి హైదరాబాద్ అంశానికి సంబంధించిన గడువు ముగిసిందని, ఇక నుంచి పూర్తిగా హైదరాబాద్ తెలంగాణకు చెందిన రాజధాని అని సీఎం పేర్కొన్న విషయం తెలిసిందే. సాయంత్రం సమయంలో ట్యాంక్ బండ్ పై నిర్వహించినటువంటి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోయిన విషయం తెలిసిందే.