Chandrababu : చంద్రబాబు ఈమధ్య దూకుడు పెంచారు. వైసీపీపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. కర్నూలు జిల్లా పర్యటన ఇచ్చిన ఉత్సాహంతో ఇక తగ్గేదేలే అంటున్నారు. తనలానే కేడర్ సైతం వైసీపీపై వీరోచితంగా పోరాడాలని పిలుపు ఇస్తున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు చంద్రబాబు.
తెగించి పోరాడకపోతే వైసీపీ శ్రేణుల అకృత్యాలు ప్రతి ఒక్కరి ఇంటినీ చుట్టుముడతాయని హెచ్చరించారు చంద్రబాబు. తాము చెప్పిందే రాజ్యాంగమనే గర్వంతో విర్రవీగుతున్న అధికార పార్టీ నేతలను ప్రజాక్షేత్రంలో శిక్షించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజ్యాంగ వ్యతిరేక పాలనపై ప్రజలందరూ ఏకమై రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని.. లేదంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు.
గడిచిన 42 నెలల్లో దాదాపు 330లకుపైగా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావడం ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనం అన్నారు. వందల సంఖ్యలో కోర్టు ధిక్కార పిటిషన్లు చూస్తుంటే పాలన గాడి తప్పిందని తెలిసిపోతోందని చెప్పారు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని.. రాష్ట్ర భవిష్యత్కు ఇది అత్యంత ప్రమాదకరమైన గొడ్డలిపెట్టు అని అన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి? ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు చంద్రబాబు.
రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజల హక్కుల రక్షణ కోసం ప్రతిపక్ష పార్టీగా టీడీపీ చేసే పోరాటానికి ప్రజలంతా కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. అధికారంలో ఉన్నామని, తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో వ్యవహరిస్తున్నారు.. అన్ని వర్గాల ప్రజలపై దాడులు చేస్తూ, వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని ముందే ఊహించి ఆంబేడ్కర్ రాజ్యాంగం రచించారని లేఖలో తెలిపారు చంద్రబాబు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో అంబేడ్కర్ చిత్రపటానికి చంద్రబాబు నివాళులర్పించారు.