జగన్ సర్కారు అలసత్వం వల్లే పోలవరం ఆలస్యమవటం సహా కొన్నిచోట్ల పగుళ్లు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తమ హయాంలోనే దాదాపు పూర్తి అయిన ప్రాజెక్టును.. ఆలస్యం చేస్తూ వచ్చారని విమర్శించారు. పోలవరం రాష్ట్రానికి ఓ వరమని.. పోలవరానికి జగనే శని అని అన్నారు. అహంకారంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని.. శని పోతే తప్ప పోలవరం కల సాకారం కాదన్నారు చంద్రబాబు.
ఏపీలో 69 నదులు ఉన్నాయని.. ఆ నదులను పూలుగా భావించానని.. ఆ పూలను పోలవరం అనే దారంతో దండ చేయాలనుకున్నానని.. ఆ దండను తెలుగుతల్లి మెడలో మణిహారంగా వేయాలని అనుకున్నానని చంద్రబాబు చెప్పారు. నదుల అనుసంధానం తెలుగుతల్లికి మణిహారంగా భావించి తాను శ్రమిస్తే.. వైసీపీ సర్కారు వచ్చాక అన్ని వ్యవస్థలూ నాశనం అయ్యాయన్నారు. టీడీపీ హయాంలో 45.72 మీటర్ల ఎత్తున పోలవరం నిర్మించాలని అనుకుంటే.. జగన్ 41.15 మీటర్ల ఎత్తుతోనే సరిపెడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తమ చేతుల మీదునే పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. ఏపీలోని నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు.
పోలవరం పూర్తి అయితే ఏపీలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వొచ్చని.. ఏ రాష్ట్రం ఏపీతో పోటీ పడలేదని.. అవసరమైతే మిగిలిన రాష్ట్రాలకు నీళ్లిచ్చేవాళ్లమని చంద్రబాబు అన్నారు. తాను ప్రాజెక్టుల దగ్గరకే వెకెళ్తున్నానని.. అక్కడే వైసీపీ సర్కారును నిలదీస్తానని చెప్పారు. తనను ముసలి నక్క అని జగన్ తిడుతున్నారని.. గట్టిగా ఓ గంట కూర్చొని ఫైల్ చూడలేని జగన్.. బూతులు తిట్టడం తప్ప ఏమైనా చేయగలరా? అని ఫైర్ అయ్యారు.