Chandrababu Kuppam Tour: కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కుప్పంలో అభివృద్ధి జరిగిందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటిస్తున్నారు. కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ప్రజలనుంచి వినతులను స్వీకరించి.. శాంతిపురం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కుప్పం నియోజకవర్గానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ అధికారంలో ఉంటే కుప్పంలో హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిచేవారమని చంద్రబాబు పేర్కొన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి హంద్రీనీవా ప్రాజెక్టును 87 శాతం పూర్తి చేస్తే.. మిగతా 13 శాతం కూడా పూర్తి చేయని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఇంతవరకూ.. ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని యద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతన్నలను ప్రోత్సహించేందుకు ఏ కార్యక్రమమైనా చేపట్టారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం వైసీపీ నాయకులకు లేదని, ప్రజల్ని దోచుకోవడమే వాళ్ల పని అని విమర్శించారు. ఇసుక, భూములు, మద్యం, నీళ్లపై వీళ్ల కన్ను పడితే మటాష్ అయిపోతాయన్నారు. వైసీపీ నేతలంతా దొంగలు, గజదొంగలని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచుకున్న డబ్బంతా కక్కిస్తానన్నారు.