Chandrababu Naidu new Speech(AP latest news): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్రంలో మంత్రివర్గ కూర్పు గురించి, అందులో టీడీపీకి ఉన్న ప్రాధాన్యతతోపాటు పలు అంశాలపై ఎంపీలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించొద్దని గెలిచిన ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని ఆయన ఎంపీలకు సూచించారు.
‘ఇక మీదట మీరు మారిన చంద్రబాబును చూస్తారు. బ్యూరోక్రాట్స్ పాలన అసలే ఉండదు. చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది. ఇకపై అలా ఉండబోదు. మీరే ప్రత్యేక్షంగా చూస్తారు. ఎంపీలందరూ తరచూ వచ్చి నన్ను కలవండి. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడుతాను. నా కోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. కత్తి.. మీద పెట్టినా జై టీడీపీ.. జై చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదు. ప్రతి అంశాన్ని నేనే వింటాను.. నేనే చూస్తాను. ఇకనుంచి రాజకీయ పాలన ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేయాలి. అందరూ ఎవరి పరిధిలో వారు పనిచేసుకుంటూ వెళ్లండి. ఈ ఐదేళ్లు కార్యకర్తల ఇబ్బందులు మనోవేదన కలిగించాయి. నేతలు, కార్యకర్తల కృషి వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేస్తాను. ఎంపీలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో పనిచేయాలి’ అంటూ చంద్రబాబు ఎంపీలకు సూచించారు.
Also Read: 40 మంది సలహాదారులను తొలగించిన ఏపీ ప్రభుత్వం
అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజా సేవకులుగా పోలీసులు మారాలంటూ చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఆయన వెంట టీడీపీ ఎంపీలు కూడా ఉన్నారు. శుక్రవారం ఎన్డీయే పక్షాల భేటీలో ఎంపీలతో కలిసి చంద్రబాబు పాల్గొననున్నారు.