Big Breaking : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. నేడు చంద్రబాబుకు 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ..న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున రావు బెయిల్ తీర్పును వెలువరించారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం దృష్ట్యా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్టై.. 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరుతో విముక్తి లభించింది.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు మధ్యంత బెయిల్ పిటిషన్పై సోమవారం ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. విచారణ సందర్భంగా చంద్రబాబు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అయితే.. ఆయన రెండో కంటికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించినట్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు వెంటనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అంతకు ముందు చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్గా వాదనలు వినిపించగా.. ఆయన కూడా చంద్రబాబు ఆరోగ్యపరమైన అంశాలనే ప్రస్తావించారు.
ఇక ఏపీ ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబుకు ప్రభుత్వ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని కోర్టుకు తెలిపిన ఆయన..ఆపరేషన్ ఇప్పటికిప్పుడే అవసరం లేదని వాదించారు. అయితే.. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. చికిత్స నిమిత్తం నాలుగు వారాలపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నాలుగు వారాల్లో చంద్రబాబు ఎవరితోనూ మాట్లాడకూడదని షరతు విధించింది. అలాగే ఆస్పత్రిలోనే ఉండాలని ఆదేశించింది. నవంబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు కోర్టుకు సరెండర్ అవ్వాలని తెలిపింది. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది.
చంద్రబాబునాయుడికి మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు నాయుడు విడుదలవుతారని సమాచారం. చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరు కావడంతో.. నారా లోకేష్, బ్రాహ్మణి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు.