Tiruvuru: తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి త్వరలోనే వస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరువూరులో నిర్వహించిన “రా కదలిరా” కార్యక్రమానికి హాజరైన ఆయన.. రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే తెలుగు జాతి నంబర్ వన్ గా ఉండాలనేది తన ఆకాంక్ష అని.. తెలుగు జాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఎంతో ఉపయోగపడిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రైతు.. అప్పుల్లో దేశంలోనే నంబర్ వన్ గా నిలిస్తే, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. నిరుద్యోగంలోనూ రాష్ట్రాన్ని నంబర్ 1 గా మార్చిన ఈ ఘనత నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందని ఘాటుగా విమర్శించారు. తన స్వార్థం కోసం కాంట్రాక్టర్ ను మార్చి.. పోలవరం ఆగిపోయేలా చేశాడని జగన్ ను దుయ్యబట్టారు.
జగన్ అరాచక పాలనలో.. ప్రజలతో పాటు తానుకూడా ఒక బాధితుడేనని.. త్వరలోనే రాక్షస పాలనకు చరమగీతం పాడాలన్నారరు. పట్టిసీమను పాడుబెట్టిన జగన్ కు.. డయాఫ్రం వాల్ ఎక్కడుందో కూడా తెలియకపోవడం గమనార్హమన్నారు. కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ ప్రభుత్వంలో.. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనకబడిపోయిందన్నారు.
హైదరాబాద్ వెలిగిపోతుంటే.. అమరావతి మాత్రం వెలవెలబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధాని అమరావతే అని గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేస్తానన్నారు. అరాచక శక్తుల పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు “రా కదలిరా” అని పిలుపునిస్తున్నానన్నారు. దుర్మార్గ పాలనలో వ్యవసాయ శాఖను మూసేయడంతో.. ధాన్యం రైతులు దగాపడ్డారన్నారు.
.
.