Chandrababu Naidu as a TDP Legislative Leader: టీడీపీ శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడి పేరును అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దానికి టీడీపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ పురందేశ్వరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి సీఎంగా చంద్రబాబు నాయుడి పేరును ప్రతిపాదించారు. అందుకు జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. కూటమి అంటే ఎలా ఉండాలో.. ఏపీ ప్రజలు దేశానికి చూపించారన్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని, ఎన్నో సందర్భాల్లో వెనక్కి తగ్గి సంయమనం పాటించామన్నారు.
గడిచిన ఐదేళ్లు ఏపీ ప్రజలు ఎంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. మనందరి పోరాటంతో.. అద్భుతమైన విజయాన్ని అందుకున్నామన్నారు. కక్ష సాధింపు చర్యలకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని, అందరూ ఓర్పుగా ఉండాలని కోరారు.
Also Read: PM Modi with Pawan, Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం, అరుదైన ఘట్టం వెనుక…
చంద్రబాబు నాయుడి అవసరం రాష్ట్రానికి ఎంతో ఉందని, అందుకే సీఎంగా ఎన్టీయే కూటమి నుంచి చంద్రబాబు నాయుడి పేరును ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఐదుకోట్ల మంది ప్రజల భవిష్యత్ కోసం.. అందరం కలిసి పనిచేయాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని.. ఆ దిశగా కృషి చేస్తామన్నారు.
అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. కూటమిగా ఇంతటి ఘన విజయాన్ని అందుకుంటామని అస్సలు ఊహించలేదన్నారు. ఈ విజయంతో మనం పాఠం నేర్చుకోవాలని, నిజమైన సంక్షేమం లేకపోతే ప్రజలు పాలకులను పట్టించుకోరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. జగన్ పాలనలో రుజువైన ఈ విషయాన్ని గుర్తుంచుకుని.. ప్రజాహిత పాలనను అందించేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు పురందేశ్వరి. కూటమి సీఎంగా చంద్రబాబు నాయుడి పేరును పవన్ ప్రతిపాదించగా.. దానిని పురందేశ్వరి బలపరిచారు.