Chandrababu met Governor S. Abdul Nazeer for Swearing: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.
అంతకుముందు విజయవాడ ఏ కన్వెన్షన్ హాలులో కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఇదిలా ఉంటే.. ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గన్నవరం ఐటీ పార్క్ వద్ద ఏర్పాట్లు చేశారు. నాలుగోసారి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ తోపాటు వివిధ పార్టీల అగ్రనేతలు హాజరుకానున్నారు. రేపు ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు విజయవాడలోనే ప్రధాని ఉండనున్నారు. వీఐపీల తాకిడి నేపథ్యంలో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్ నీరభ్ కుమార్ సమీక్ష కూడా నిర్వహించారు.
Also Read: కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు
ఇక, వీఐపీల కోసం నాలుగు గ్యాలరీలు, ప్రజల కోసం ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు. మొత్తం 5 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న కేశరపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున హైవేపై పలు ఆంక్షలు విధించారు. ఇవాళ సాయంత్రం నుంచే ట్రాఫిక్ మళ్లీంపులు, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ కార్యక్రమానికి మొత్తం 2 లక్షల మంది వరకు రావొచ్చంటూ అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ LED తెరలను కూడా ఏర్పాటు చేశారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్ గా హాజరుకానున్నారు. అదేవిధంగా సినిమా హీరో రజినీకాంత్ తోపాట పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.