Chandrababu: చంద్రబాబు 2.0 వర్షన్ చూపిస్తున్నారు. యాత్రలు, చర్చలు, గ్యారెంటీలతో వైసీపీకి సినిమా చూపిస్తున్నారు. ఏకంగా పులివెందులలోనే జగన్ను సవాల్ చేసి సత్తా చాటారు. తండ్రికి తోడుగా నారా లోకేశ్ యువగళంతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. రాటుదేలిన లోకేశ్.. పదునైన విమర్శలతో చెలరేగిపోతున్నారు. వీరితో సంబంధం లేకున్నా.. ముందుముందు పొత్తు పక్కా అంటున్న జనసేనాని సైతం వారాహి యాత్రతో అధికారపార్టీపై దండయాత్ర చేస్తున్నారు. అటు, బీజేపీ సైతం గేరు మార్చి వైసీపీపైకి దూసుకొస్తోంది. ఇలా జగన్పై ముప్పేట దాడి జరుగుతోంది.
టీడీపీ ప్రకటించిన భవిష్యత్కు గ్యారెంటీని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు చంద్రబాబు. తాజాగా, కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు బస్సులో ప్రయాణించి.. మహిళలకు గ్యారెంటీ హామీల గురించి వివరించారు. అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు.
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు నుంచి జొన్నాడ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు చంద్రబాబు. ప్రభుత్వ అరాచకాలు, పెరిగిన కరెంట్ బిల్లులు, నిత్యావసర ధరలు, చెత్త పన్ను.. ఇలా మహిళలు నేరుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారితో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రకటించిన మహా శక్తి పథకం గురించి సవివరంగా చెప్పారు.
అయితే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కర్నాటక కాంగ్రెస్ హామీని కాపీ కొట్టారంటూ ఇప్పటికే వైసీపీ విమర్శిస్తోంది. హామీ మాత్రమే కాదు.. ప్రచారంలోనూ కాంగ్రెస్నే ఫాలో అవుతున్నారని ఆరోపిస్తోంది. కర్నాటక ప్రచారంలో రాహుల్ గాంధీ బస్సులో ప్రయాణించి ప్రయాణీకులతో మాట్లాడారని.. ఇప్పుడు చంద్రబాబు సైతం రాహుల్ మాదిరే బస్ ఎక్కి మాట్లాడారంటూ ఎద్దేవా చేస్తున్నారు.
మరోవైపు, కోనసీమ జిల్లా మండపేటలో పంచాయతీరాజ్ వ్యవస్థపై.. సర్పంచులతో సమావేశమయ్యారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. సర్పంచ్లకు చెక్ పవర్ లేకుండా చేశారని..గ్రామంలో ఏ పని చేయాలన్న కనీసం నిధులు ఇవ్వని పరిస్థితి దాపరించిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సర్పంచ్లకు పూర్వ వైభవం తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.
అటు, ఆలమూరు మండలం జొన్నాడలో ఇసుక కొండలను చంద్రబాబు పరిశీలించారు. ఇసుక మేటలు దగ్గర సెల్పీ చాలెంజ్ విసిరారు. ఏడాదికి 228 కోట్లు కొల్లగొడుతున్న జేపీ వెంచర్పై 24 గంటల్లో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.