Chandrababu Govt: సీఎం చంద్రబాబుపై నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోందా? ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు గడిచినా కొందరు అధికారుల విషయంలో ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది? బెజవాడ వరదలతో సీఎం చంద్రబాబుకు క్లారిటీ వచ్చిందా? వరద బాధితులను రెచ్చగొట్టడం వెనుక కొందరి అధికారుల ప్రమేయముందా? వీటిపై ఏపీ ప్రజలు తలో విధంగా చర్చించుకుంటన్నారు.
వివాదాస్పద ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల విషయంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్, కాదంబరి జెత్వానీ కేసు, బెజవాడ వరదల్లో కొందరు అధికారుల వ్యవహారశైలి నేపథ్యంలో వేటుపడడం ఖాయమని ప్రభుత్వ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.
వీరిలో కొందరు ఐపీఎస్లు టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆ కేసులకు సంబంధించి విచారణకు రావడంలేదట సీనియర్ అధికారులు. ఈ నేపథ్యంలో వారిపై వేటు వేయాలని భావిస్తోందట కూటమి ప్రభుత్వం.
వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ముంబై నటి కాదంబరి.. ఏపీ ప్రభుత్వం మారిన తర్వాత రంగంలోకి దిగేసింది. ముంబై నుంచి విజయవాడ వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి విచారణ అధికారులకు చెప్పింది. కొందరు ఐపీఎస్లపై పిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం పిలిచినా కొందరు ఐపీఎస్లు మొండికేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా అధికారులను సస్పెండ్ చేయాలని భావిస్తోందట. దీనివల్ల విచారణకు ఎలాంటి అడ్డంకులు ఉండవన్నది ప్రభుత్వ ఆలోచన.
అలాగే మాజీ ఎంపీ, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. ఈ నేపథ్యంలో అందులో ప్రమేయమున్న అధికారులపై వేటు వేస్తే విచారణ వేగవంతం అవుతుందన్నది ప్రభుత్వం భావిస్తోంది.
ALSO READ: అగ్రిగోల్డ్ భూముల కేసు.. జోగి రాజీవ్ కు షాకిచ్చిన హైకోర్టు
ఇక బెజవాడ వరదల్లో కొందరు ఐపీఎస్, ఐఏఎస్ మద్దతుదారులు.. వరద బాధితులను రెచ్చగొట్టినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొందరు వ్యక్తులు ఓ గ్రూప్గా ఏర్పడి సహాయ కార్యక్రమాలు చేసినట్టు హైప్ క్రియేట్ చేసి వరద బాధితులను రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించారని తేలింది. దీని వెనుకున్న అధికారులపై దృష్టి పెట్టింది. ఇందులో వివాదాస్పద ఐపీఎస్లకు లింకు ఉన్నట్లు తేలింది.
అంతేకాదు ఉదయం-సాయంత్రం డీజీపీ ఆఫీసులో అందుబాటులో ఉండాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, చాలామంది అధికారులు రాలేదని తెలుస్తోంది. జరిగిన.. జరుగుతున్న పరిణామాలను గమనించిన కూటమి సర్కార్.. కొందరు ఐపీఎస్లపై వేటు వేయాలనే నిర్ణయించినట్టు అంతర్గత సమాచారం.