ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఊరట లభించింది. సోమవారం వరకు ఆయనను కస్టడీలోకి తీసుకోవద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసుపై సీఐడీ రిమాండ్ను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. అలాగే చంద్రబాబును ఇప్పుడే కస్టడీకి ఇవ్వొద్దని ఆయన తరపు లాయర్లు కోరారు. ఈ విజ్ఞప్తికి న్యాయస్థానం అంగీకరించింది.
17A సెక్షన్పై వాదనలు వినిపిస్తానంటూ చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ్ లుథ్రా పట్టుబట్టారు. అరెస్ట్పై గవర్నర్ అనుమతి కావాల్సిందేనని స్పష్టం చేశారు. ముందు CID నుంచి కౌంటర్ పిటిషన్ దాఖలు కావాలని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. కౌంటర్ దాఖలు తర్వాత పూర్తి వాదనలు వింటామని స్పష్టం చేశారు. పిటిషన్ పై విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేశారు.
ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని వేరే బెంచ్కు మారుస్తామన్నారు హైకోర్టు న్యాయమూర్తి. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా. సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసు ప్రాథమిక దశలో ఉందని కోర్టుకు తెలిపారు. అలాగే కౌంటర్ దాఖలకు సమయం కోరారు.
ఇక మరోవైపు చంద్రబాబును 5 రోజులపాటు కస్టడీకి కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ సమయంలో సోమవారం వరకు కస్టడీకి తీసుకోవద్దని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం తర్వాతే ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్టు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇన్నర్ రింగ్రోడ్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ 2022లో కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబును A1గా చేర్చారు పోలీసులు. దీంతో ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు టీడీపీ అధినేత. ఈ పిటిషన్పై హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.