Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది. లాయర్లు, వైసీపీ కార్యకర్తల నుంచి బాబుకు నిరసన సెగ తగిలింది. రాయలసీమ ద్రోహి.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ఆందోళనకు దిగారు. టీడీపీ శ్రేణులు సైతం పోటాపోటీ నిరసనలు చేయడంతో.. కర్నూలులో హైటెన్షన్ నెలకొంది.
కర్నూలులో చంద్రబాబు మొదటిరోజు పర్యటనకు ప్రజల నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. బాబు ర్యాలీలకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. వైసీపీకి మంచి పట్టున్న సీమలో.. పసుపు జెండాలు రెపరెపలాడటం, టీడీపీ నినాదాలతో హోరెత్తడంతో.. తెలుగు తమ్ముళ్లలో ఫుల్ జోష్ వచ్చింది. కట్ చేస్తే.. ఆ ఉత్సాహం అంతా నీరుగారిపోయేలా.. లాయర్ల రూపంలో నిరసన ఎదురవడం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందంటూ టీడీపీ మండిపడుతోంది. ఇంతకీ కర్నూలులో అసలేం జరిగిందంటే…
జిల్లా టీడీపీ ఆఫీసు దగ్గర ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన చంద్రబాబును లాయర్లు, వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కర్నూలుకు న్యాయ రాజధాని రాకుండా అడ్డుపడుతున్నారంటూ ఆందోళనకు దిగారు. చంద్రబాబు వైపు దూసుకొచ్చారు. లాయర్ల ముసుగులో వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ తనపై దాడి చేయాలని చూసిందంటూ బాబు మండిపడ్డారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నేను కనుసైగ చేస్తే మీరు చిత్తు చిత్తు అవుతారు. అసెంబ్లీలో అమరావతి రాజధాని చేస్తామంటే జగన్ ఒప్పుకున్నారు. ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ నాటకాలు ఆపాలి. నాతో పెట్టుకోవడానికి వైఎస్సార్ భయపడ్డారు. ఈ పేటీఎమ్ బ్యాచ్ ఎంత’ అంటూ చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
రాయలసీమకు ఎవరేమి చేశారో చర్చించడానికి తాను సిద్ధమని.. సీమ అభివృద్ధిపై చర్చించడానికి పేటీఎమ్ బ్యాచ్ సిద్ధమా.. అని చంద్రబాబు సవాల్ చేశారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే శక్తి టీడీపీకే ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.