Chandrababu Naidu Fires on Jagan : అమరావతిలోని ఏపీ సెక్రటేరియట్ భవనాలను జగన్ సర్కార్ తాకట్టు పెట్టడంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సీఎం జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ వైఖరిని తీవ్రస్థాయిలో ఖండిస్తూ చంద్రబాబు ఆదివారం ట్వీట్ చేశారు. ఏపీకి గుండెకాయలాంటి సచివాలయాన్ని తాకట్టుపెడతారా అంటూ ధ్వజమెత్తారు. ఈ చర్య రాష్ట్రానికి అవమానకరం.. చాలా బాధాకరం అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని 12.5లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిన సీఎం జగన్ ఇప్పుడు సెక్రటేరియట్ తాకట్టు పెట్టారని తెలసి షాక్ కి గురైనట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. సీఎం జగన్ తీరు చూసి ఆర్థికవేత్తలు తలబాదుకుంటున్నారని పేర్కొన్నారు.
Read More : కంటకాపల్లి రైలు ప్రమాదం.. ఫోన్లో క్రికెట్ చూస్తూ నడపడంవల్లేనన్న మంత్రి
చంద్రబాబు హయాంలో 700కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సెక్రటేరియట్ భవనాలను తొలుత ఐసీఐసీఐ బ్యాంకులో తనఖా పెట్టేందుకు ఏపీ సర్కారు ప్రయత్నించినట్టు సమాచారం. వారు మార్టగేజ్కి ఒప్పుకోకపోవడంతో హెచ్డిఎఫ్సి బ్యాంకును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశ్రయించింది. సెక్రటేరియట్ భవనాల మార్టగేజ్ రిజిస్ట్రేషన్ చేస్తే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. దీంతో జగన్ సర్కారు గుట్టుచప్పుడు కాకుండా సెక్రటేరియట్లోని ఐదు భవనాలను హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తనఖా రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలిసింది. బ్యాంకు నుంచి మొత్తం 370 కోట్ల రూపాయల రుణాన్ని ఏపీ ప్రభుత్వం పొందినట్టు వెల్లడైంది.
ప్రజల ఆస్తులు, సంపద తాకట్టు పెట్టి జగన్ సర్కారు అప్పులు తేవడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో ఏపీ లిక్కర్ వ్యాపారాన్ని తనఖాపెట్టి 48 వేల కోట్ల రూపాయలు అప్పు తేవడం సంచలనం సృష్టించింది. వైజాగ్లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, భూములు, కాలేజీలు తాకట్టు పెట్టి ఏపీఎస్డీసీ ద్వారా 25 వేలకోట్లు అప్పులు తెచ్చారు. రోడ్లు భవనాల శాఖ ఆస్తులు తనఖాపెట్టి 7 వేల కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు ఆ కోవలోకి సెక్రటేరియట్ భవనాలు చేరాయి.
“రాష్ట్రానికి ఎంత అవమానకరం…ఎంత బాధాకరం…ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు….తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ని! ప్రజలారా…అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి!” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
రాష్ట్రానికి ఎంత అవమానకరం…ఎంత బాధాకరం…ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ… pic.twitter.com/tUNaoecZKR
— N Chandrababu Naidu (@ncbn) March 3, 2024