Teacher murder news in ap today(Andhra news updates): విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. రాజకీయ కారణాలతో టీచర్ను చంపడం దారుణమన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి హత్యలకు ప్రభుత్వ పెద్దలు, అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణమని మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.
ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణను దుండగలు బొలెరో వాహనంతో ఢీకొట్టి చంపేశారు. రాజాం సీఐ రవికుమార్, బాధిత కుటుంబసభ్యుల చెప్పిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం తన ఇంటి నుంచి కృష్ణ బైక్ పై తెర్లాం మండలం కాలంరాజుపేటలోని పాఠశాలకు వెళుతుండగా ఈ హత్యకు గురయ్యారు. ఒమ్మి సమీపంలోని కొత్తపేట వద్ద నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
మృతుడి కుమారుడు శ్రావణ్కుమార్ చేసిన ఫిర్యాదుతో ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకట నాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిపై కేసు నమోదు చేశామని సీఐ రవికుమార్ తెలిపారు. ఉపాధ్యాయుడు కృష్ణ అంత్యక్రియలు ఉద్దవోలులో నిర్వహించారు. ఆ గ్రామంలో పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది.
కృష్ణ తెర్లాం మండలం ఉద్దవోలుకు 1988 నుంచి 1995 వరకు సర్పంచిగా సేవలందిచారు. ఆ తర్వాత 1998లో టీచర్ ఉద్యోగం వచ్చింది. 2021 ఎన్నికల్లో సర్పంచ్ గా సునీత నెగ్గారు. తర్వాత ఆమె వైసీపీలో చేరారు. అప్పటికే వైసీపీలో ఉన్న వెంకటనాయుడు పథకం ప్రకారమే కృష్ణను హత్య చేశారని మృతుడి భార్య జోగేశ్వరమ్మ, కుమారుడు శ్రావణ్కుమార్, కుమార్తె ఝాన్సీ, బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.