Chandrababu : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎటాక్ మరింత పెంచింది. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు..సీఎం వైఎస్ జగన్ విధానాలపై మండిపడుతున్నారు. అయితే కందుకూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో చంద్రబాబును దోషిగా నిలబెట్టేలా వైసీపీ ఎటాక్ చేసింది. డ్రోన్ షూటింగ్ కోసమే ఇరుకుసంధుల్లో చంద్రబాబు మీటింగ్ పెట్టారనేది వైసీపీ వాదన. అయితే ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. కొత్త ఏడాదిలోనూ అదే దూకుడుతో వెళ్లాలని చంద్రబాబు భావించినట్లు ఉన్నారు. నెల్లూరు జిల్లా రాజుపాలెంలో పర్యటించిన చంద్రబాబు…వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విధ్వంసాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కోల్పోయి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయిందని అన్నారు. ప్రభుత్వ విధ్వంసాల పనితనం ప్రజలు అనుభవించారని.. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో ఎప్పుడూ ఇంతగా ప్రజలు ఇబ్బందిపడలేదన్నారు. అందుకే జగన్ రెడ్డిని సైకో అనేది, మీడియా సహా వివిధ వ్యవస్థలపై దాడి చేసి పైశాచిక ఆనందం పొందారని చంద్రబాబు మండిపడ్డారు.
దేశంలో ఎక్కడాలేని ధరలు ఏపీలో ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతీరైతుపై అప్పుందని, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందని తెలిపారు. కౌలురైతు వ్యవస్థలో అగ్రస్థానంలో ఏపీ ఉండేది.. ఇప్పుడు కౌలు రైతులు కూడా పారిపోయారని చెప్పారు. రాష్ట్రం గంజాయి హబ్గా మారి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు ఆరోపించారు. గంజాయి, డ్రగ్స్ నివారణపై సీఎం శ్రద్ధ పెట్టట్లేదని మండిపడ్డారు. ఈ మూడున్నరేళ్లలో 53 వేల మందికిపైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని చంద్రబాబు వివరించారు.
సంపద సృష్టించే యువశక్తి రాష్ట్రంలో నిర్వీర్యమైపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల్లో నిరుత్సాహం, నిస్సహాయత నెలకొందన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారని
ఎక్కడా లేని పన్నులు రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. ప్రజలపై 40 రకాల పన్నులు మోపారని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికలకు మరో 16 నెలల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వైఫల్యాలు ఎండగడుతూ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు టీడీపీ అధినేత ప్రయత్నాలు చేస్తున్నారు. అటు సీఎం జగన్ సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. ఏపీ ఓటర్ల నాడీ ఎలా ఉందో ఎన్నికలు సమీపిస్తే కానీ పూర్తిగా అంచనా వేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.