Chandrababu: పార్లమెంట్లో ఏపీ రాజధాని ప్రస్తావన వచ్చింది. సుప్రీంకోర్టులోనూ ఏపీ కేపిటల్ పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ రెండు చోట్లా ఏపీ రాజధానిగా అమరావతి పేరే ప్రస్తావించింది కేంద్ర ప్రభుత్వం. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్రానికి రెండుకళ్లు లాంటి అమరావతి, పోలవరంను దెబ్బతీశారంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు. సీఎం జగన్, ఆ పార్టీ నేతల తీరు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని విమర్శించారు. గతంలో అమరావతి గురించి అసెంబ్లీలో జగన్, బుగ్గన మాట్లాడిన వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
అధికారంలోకి రాకముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని జగన్ ఏం చెప్పారంటూ గతాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. అమరావతే రాజధానిగా ఉంటుంది.. అమరావతిని టీడీపీ కంటే మిన్నగా అభివృద్ధి చేస్తామని చెప్పారా? లేదా? ప్రశ్నించారు. ప్రజా జీవితం అంటే జగన్ కు చులకనైపోయిందని.. ఆయన తీరు చూస్తూ ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని మండిపడ్డారు.
ఓట్ల కోసం ఎన్నో అబద్దాలు చెప్పారు.. చట్టానికి ఎన్ని తూట్లు పెట్టాలో అన్ని పెట్టి ఇష్ట ప్రకారం చేశారు.. విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానిపై స్పష్టంగా ఉన్నా.. 3 రాజధానులపై శాసనసభలో బిల్లు పాస్ చేశారంటూ వైసీపీ తీరును దుయ్యబట్టారు.
రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారని.. అమరావతి రాజధానిపై 11,395 కోట్లు ఖర్చు పెడితే.. జగన్ ప్రభుత్వం అమరావతిపై విషం చిమ్మిందని.. రాజధాని రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తే ఇబ్బందులు పెట్టారని.. లేని అధికారం ఆపాదించుకుని జగన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.