Chandrababu : కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అత్యవసర పరిస్థితి ఉందన్నారు. సీఎం జగన్ పిరికితనంతో తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే తమ పర్యటనలను అడ్డుకుంటారని ఆరోపించారు. రోడ్డు షోలు, సభలపై నియంత్రణకు చీకటి జీవో తీసుకొచ్చారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు బాధపడుతుంటే సీఎం ఆనందపడుతున్నారని విమర్శించారు. జగన్ అరాచకశక్తిగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
కొంతమంది పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చైతన్య రథాన్ని పోలీసులు తీసుకెళ్లినందుకు నిరసనగా ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి ఎం.ఎం. కల్యాణ మండపం వరకు చంద్రబాబు పాదయాత్రగా వెళ్లారు. చైతన్య రథం వాహనాన్ని వెంటనే తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. చట్టాలను అతిక్రమించిన పోలీసులూ నేరస్థులేనని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ లా అండ్ ఆర్డర్ను కాపాడేందుకు వచ్చారా? టీడీపీ కార్యకర్తలపై దాడులకు వచ్చారా? అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థపై కేసులు పెడతామని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులపై ప్రైవేట్ కేసులు పెట్టి బోనెక్కిస్తామన్నారు.
40 ఏళ్లుగా టీడీపీ పోరాడుతోందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అంధకారం చేయకూడదని పోరాడుతున్నామని స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి, షర్మిల, జగన్ పాదయాత్రలు చేశారని గుర్తు చేశారు. ఆ పాదయాత్రలకు పోలీసు భద్రత కల్పించానని స్పష్టం చేశారు. ఇప్పుడు తన నియోజకవర్గంలో తిరుగుతుంటే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ నేతలు బయటకు రాకుండా చేసేందుకు పోలీసులు చేసిన కుట్రలో భాగంగానే కందుకూరు, గుంటూరు ఘటనలు జరిగాయని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు కుప్పంలోనూ ఆ తరహాలోనే చేస్తున్నారని ఏంటీ అరాచకాలు? అని ప్రశ్నించారు. పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడతామన్నారు. 5 కోట్ల మంది ప్రజలు ఒకవైపు.. జగన్ మరో వైపు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని కాపాడతారా? సైకో పక్కన ఉంటారా? వాళ్లే ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు.