Chandrababu: జగనన్నే మా భవిష్యత్తు.. వైసీపీ లేటెస్ట్ క్యాంపెయిన్. ఇంటింటికీ వెళ్లడం వారికి ప్రభుత్వ పథకాలు వివరించడం.. వారి ఇంటికి, వారి మొబైల్ ఫోన్ కి.. జగనన్నా నువ్వే మా నమ్మకం.. అనే స్టిక్కర్ వేయడం.. ఇదీ కాన్సెప్ట్. ఈ కార్యక్రమంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘నువ్వే మా నమ్మకం కాదు.. నువ్వే మా దరిద్రం’ అని ప్రజలు అంటున్నారని చంద్రబాబు సెటైర్లు వేశారు. ప్రజల కష్టాలకు ప్రధాన కారకుడైన వారే మీ నమ్మకం అంటూ స్టిక్కర్ వేస్తాడట అని ఎద్దేవా చేశారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు చంద్రబాబు. ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన చెత్త సైకో సీఎం జగన్ అంటూ మండిపడ్డారు. జగన్రెడ్డి ఇచ్చే 10 రూపాయలు మాత్రమే కనిపిస్తోంది కానీ, దోచుకునే రూ.50 గురించి తెలుసుకుంటే వైసీపీ నేతల్ని ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వరని అన్నారు.
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. నిర్వాసితులకు సంబంధించి వెయ్యి ఎకరాల పరిహారాన్ని బోగస్ పట్టాలతో వైసీపీ నేతలు కొట్టేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే దీనిపై సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పారు. జగన్ విధానాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. వైసీపీ పని అయిపోయిందని, ఇక గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పారు.