CID : టీడీపీ నేత కుటుంబంపై సీఐడీ దాడులు చేయడం ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రిలోని ఆదిరెడ్డి ఇంటికి వెళ్లి తండ్రీకుమారులను స్థానిక సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆదిరెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న జగత్ జనని చిట్స్ వ్యవహారంలో సీఐడీ అధికారులు ప్రశ్నించారు.
ఆదిరెడ్డి కుటుంబంపై సీఐడీ దాడులను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో ఎవరూ వ్యాపారం చేయకూడదు అన్నట్టు సీఎం జగన్ వ్యవహారం ఉందని మండిపడ్డారు. తండ్రీకొడుకులను సీఐడీ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే భవానీతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. రోజురోజుకీ వైసీపీ వేధింపులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కేసులు పెట్టి లొంగదీసుకోవాలనే ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. సీఐడీ దర్యాప్తు సంస్థా.. లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా? కోర్టులతో చీవాట్లు తిన్నా ప్రభుత్వ బుద్ధి మారలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీలో చేరలేదనే అక్కసుతోనే ఆదిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఒక కన్నును పొడిచిన మరో కన్నును సీబీఐ అరెస్ట్ చేసే వేళ.. ఆదిరెడ్డి కుటుంబాన్ని సీఐడీ అదుపులోకి తీసుకోవడం జగన్ స్టైల్ డైవర్షన్ డ్రామా అని ట్వీట్ చేశారు. ఫిర్యాదులు లేని కేసుల్లో బీసీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులను అదుపులోకి తీసుకోవడం ఏ1 దొంగ పాలనలోనే సాధ్యమని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినా భయపడేది లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు చినరాజప్ప, నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. వైసీపీ కేడీలకు, సీఐడీ అధికారులకు తేడా లేకుండా పోయిందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతుంటే.. సీఐడీ అధికారులు సోదాల పేరుతో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మహానాడు రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలోనే స్థానిక నేతలను భయపెట్టాలన్న కుట్రలో భాగంగానే అరెస్టు చేశారని ఆరోపించారు. సీఎం జగన్ అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్ష నేతల అరెస్టులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే అంతా నడుస్తోందని ఆరోపించారు.