Kuppam: పాపం చంద్రబాబు. ఎలాంటి నేతకి.. ఎలాంటి పరిస్థితి వచ్చింది. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇంతటి ఇబ్బంది ఇంతకు ముందెప్పుడూ వచ్చి ఉండదు. తన సొంత నియోజకవర్గంలోనే ఆయన పర్యటించే పరిస్థితి లేదు. పోలీస్ బలగాలతో అడ్డుకున్నారు. ప్రచార రథం లాక్కున్నారు. కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. అందుకు, జీవో నెం.1 ను సాకుగా చూపించారు. ఇలా, అన్నివైపుల నుంచి చంద్రబాబును లాక్ చేసి.. ఆయన కుప్పం పర్యటనలో కదలకుండా చేయడంలో సర్కారు సక్సెస్ అయిందని అంటున్నారు.
చంద్రబాబును కుప్పంలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకోవాలనేది ప్రభుత్వ పంతంలా కనిపిస్తోంది. సమస్యలు సృష్టించి.. అసహనానికి గురి చేసి.. సరిహద్దుల నుంచే వెనక్కి పంపించేయాలనేది స్కెచ్ అంటున్నారు. గతంలో విశాఖలో అలానే చేసి అధికార పార్టీ విజయం సాధించింది. వైసీపీ ప్రభుత్వ కుట్రను పసిగట్టిన చంద్రబాబు.. ఈసారి మాత్రం విశాఖ సీన్ రిపీట్ కాకుండా జాగ్రత్తపడుతున్నారు. కుప్పంను వదిలేదే లేదంటున్నారు.
బుధవారం చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. గురువారం పొద్దూరులోనే ఇంటింటి పాదయాత్ర చేశారు. గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రికెళ్లి పరామర్శించారు. శుక్రవారం గుడిపల్లిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబుకు చిరాకు వచ్చేసింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్థానిక బస్టాండ్ సమీపంలో రోడ్డుపైనే బైఠాయించారు. తన ప్రచార రథం తనకు ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు.
తనను పదే పదే అడ్డుకుంటున్న పోలీసులకు చంద్రబాబు తనదైన స్టైల్ లో క్లాస్ తీసుకున్నారు. “పోలీసులూ.. మీరు బానిసలుగా బతకొద్దు. ప్రజలు తిరగబడితే ఏం చేయగలరు? పోలీసులు ఎక్కడుంటారు.. మీరు ఆకాశంలో తిరగాల్సి ఉంటుంది. ఎన్ని జైల్లు, పోలీస్స్టేషన్లు ఉన్నాయి? ఎంతమంది ప్రజలను వాటిలో పెట్టగలరు? చట్టప్రకారం మీ విధులు నిర్వర్తించండి. ఇక్కడి నుంచి నన్ను తిరిగి పంపాలని చూస్తున్నారు.. కానీ నేను వెళ్లను. మిమ్మల్నే ఇక్కడి నుంచి పంపిస్తా. మిమ్మల్నే కాదు.. సైకో సీఎం, ఆయన పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేసే వరకు తెలుగు ప్రజల తరఫున పోరాడతా. నా గొంతు 5 కోట్ల మంది ప్రజలది. ఆ విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలకు తావులేదు. జీవో నంబర్ 1 చట్టవిరుద్ధమైనది. రాజమహేంద్రవరంలో సీఎం జగన్ మీటింగ్ పెట్టలేదా? రోడ్షో చేయలేదా? మీ పార్టీ నేతలు రోడ్డు షోలు నిర్వహించలేదా? జగన్.. సమాధానం చెప్పండి. నీకో రూలు.. నాకో రూలా?” అంటూ చంద్రబాబు పోలీసులపై, ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇంత పోరాడుతున్నా.. చంద్రబాబును ముందుకు మాత్రం కదలనీయడం లేదు పోలీసులు. ప్రచార రథం ఇవ్వట్లేదు. మరి, కుప్పం పట్టణంలో అడుగుపెట్టనీయకుండా చంద్రబాబును ఆపుతారా? ఆయన ఆగుతారా? కాలినడకనే గ్రామాలన్నీ చుట్టేస్తారా?