Chandrababu: తిరుమల కాలినడక మార్గంలో చిరుత కలకలం కొనసాగుతోంది. భక్తులకు టీటీడీ కర్రలు పంపిణీ చేయడం వివాదాస్పదమవుతోంది. సోషల్ మీడియాలో ట్రోలర్స్ ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. టీటీడీ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. లేటెస్ట్గా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ అంశంపై స్పందించారు.
తిరుమలలో పులులుంటే భక్తులకు కర్రలు ఇస్తారా? భక్తులు శ్రీవారిని చూడడానికి కాదు.. పులులను చంపడానికి వెళ్తున్నట్టుందన్నారు. కర్ర ఉంటే పులి పారిపోతుందా? అని ప్రశ్నించారు. ఇంటికో కర్ర పెట్టుకుని వైసీపీ దొంగలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు చంద్రబాబు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే జనాలకు గోచీ కూడా మిగలదని హెచ్చరించారు.
‘భవిష్యత్తు గ్యారంటీ’ యాత్రలో భాగంగా కోనసీమ జిల్లాలో మూడోరోజు పర్యటించారు చంద్రబాబు. అమలాపురం బహిరంగ సభలో జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అంటూ మండిపడ్డారు. జగన్ అధికారంలోకి రావడం కోసం తల్లి, చెల్లిని కూడా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. పేదలను దోచుకుంటున్నారని.. రుషికొండకూ గుండు కొట్టారని ఫైర్ అయ్యారు చంద్రబాబు.
కేసులు మాఫీ చేసే వారి కోసం ఎంపీ సీటును జగన్ అమ్ముకున్నారని.. నిజాలు మాట్లాడితే పవన్ కల్యాణ్, మీడియాపైనా విరుచుకుపడుతున్నారని.. వైసీపీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని తేల్చి చెప్పారు టీడీపీ అధినేత.