Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. జీవో నెం.1 కాపీలను భోగి మంటల్లో దహనం చేసి జగన్ సర్కారుకు నిరసన తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను భోగి మంటల్లో వేసి కాల్చామని.. సైకో పాలన పోవాలని కోరుకున్నామని చంద్రబాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు.
తాను పుట్టినప్పుడు నారావారిపల్లెలో చిన్న రోడ్డు లేదు.. కనీసం కరెంట్ కూడా లేదు.. ఇవన్నీ గుర్తుపెట్టుకుని నేషనల్ హైవేస్ ప్రాజెక్టును, అద్భుతమైన రోడ్లను తీసుకువచ్చామన్నారు చంద్రబాబు. అయితే ప్రస్తుతం రాష్ట్ర రహదారులు దారుణంగా ఉన్నాయని.. రాష్ట్ర రోడ్లపై తిరిగి తనకు నడుం నొప్పి వచ్చిందన్నారు. దేశంలో ఎక్కువ పెట్రో ధరలు, ఎక్కువ కరెంట్ ఛార్జీలు, ఎక్కువ ఇంటి పన్ను, చెత్త పన్ను ఉన్న రాష్ట్రం ఏపీనే అన్నారు చంద్రబాబు.
తనకు జగన్పై ఎలాంటి ద్వేషం లేదని.. జగన్ తండ్రి వైఎస్ఆర్ తనకు మంచి స్నేహితుడని చంద్రబాబు చెప్పారు. కానీ, జగన్ సర్కారును ప్రశ్నించిన తనపై కేసులు పెడుతున్నారని.. తనను అడ్డుకుంటున్నారని.. తన సభలకు బందోబస్తు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు చంద్రబాబు. కందుకూరు, గుంటూరు సభలో జరిగిన తొక్కిసలాట ప్రభుత్వ కుట్రలో భాగమే అన్నారు. ఇవన్నీ చూపించి జీవో 1 తీసుకువచ్చారని.. తామే ప్రజలను కలవకూడదని ఆంక్షలు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. గుర్తుపెట్టుకో పెద్దిరెడ్డి.. లెక్కలు రాసి పెడుతున్నా.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల మెడపై కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని మండిపడ్డారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై 40 రోజుల్లో 10 కేసులు పెట్టారు. కార్యకర్తలను పండగపూట జైల్లో పెట్టారు. దీనికి పెద్దిరెడ్డి తప్పక అనుభవిస్తాడు. ఇంతకు ఇంతా చేస్తాం.. అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అధికార పార్టీలో నాగభూషణం, రాజనాల కంటే పెద్ద విలన్లు ఉన్నారని.. ఏడాది తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక.. ఎక్కడికి పారిపోయినా ఈ సైకోలను తీసుకువచ్చి శిక్షిస్తానంటూ చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.