స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎట్టకేలకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ మంజూరుతో జైలు నుంచి చంద్రబాబు బయటకు రాన్నారు. ఆ తర్వాత రాజమండ్రి నుంచి అమరావతికి వెళతారు. బుధవారం కానీ గురువార కానీ ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత హైదరాబాద్ కు చేరుకుంటారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు.
ఇప్పటికే చంద్రబాబు ఓ కంటికి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలోనే శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ సర్జరీ తర్వాత మూడు నెలలకు మరో కంటికి సర్జరీ చేయించుకోవాలని ఆస్పత్రి వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ని సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టటంతో చంద్రబాబుకు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి చంద్రబాబు అక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
73 ఏళ్ల చంద్రబాబుకు జైల్లో పలు అనారోగ్య సమస్యలకు గురయ్యారు. స్కిల్ ఎలర్జీతోపాటు శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యాయి. కంటికి శస్త్ర చికిత్స చేయించాల్సిన అవసరం ఏర్పడింది. ఆయనకు జైల్లో తగిన వైద్య సదుపాయాలు లేవని ఆయన తరపు లాయర్లు పిటిషన్ల ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటువంటి అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకున్న ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ రావటంతో కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు నడుచుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఏపీలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. రాజమండ్రి, కుప్పం, మంగళగిరి ప్రాంతాల్లో టపాసులు పేల్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు. చంద్రబాబుపై పెట్టిన ఏ కేసూ నిలబడదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. జైలు నుంచి చంద్రబాబు కాలు బయటకు పెట్టిన సమయం నుంచే జగన్ పతనం ప్రారంభమవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు.