TDP Janasena Alliance
TDP Janasena Alliance : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పొత్తుల లెక్కలు కొలిక్కి తెచ్చుకునేందుకు టీడీపీ-జనసేన ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదలి రా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అలాగే జనసేనాని కూడా అమరావతి టూర్ కూడా వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు సమావేశమై మొదటి జాబితాపై వర్కవుట్ చేయనున్నారని సమాచారం.
వచ్చే మూడు రోజుల్లో మొదటి జాబితా విడుదల చేసే దిశగా టీడీపీ- జనసేన కసరత్తు చేస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల విషయంలో కాస్త సర్దుకుపోయే ధోరణితో పవన్ కల్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 3వ వంతు కోసం జనసేనాని పట్టుబడతారని అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త తగ్గాలనే పవన్ భావిస్తున్నారట. జనసేనకు 25 నుంచి 30 ఎమ్మెల్యే స్థానాలు, రెండు నుంచి 4 ఎంపీ సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తరుచుగా లేఖాస్త్రాలు సంధిస్తున్న హరిరామజోగయ్యకు పవన్ పలు సూచనలు చేశారు. ఇకపై ఎలాంటి లేఖలు రాయొద్దని కోరినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఇటీవల చంద్రబాబు మండపేట, అరకు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన మధ్య చిన్న వివాదం రేగింది. చంద్రబాబు ప్రకటనకు కౌంటర్ గా రిపబ్లిక్ డే రోజు పవన్ కల్యాణ్ కూడా రెండు సీట్లను ప్రకటించారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించనందు వల్లే తాను కూడా అది తప్పుతున్నానని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో సీట్లు సర్దుబాటుపై అవగాహన వచ్చే అవకాశం ఉంది.